రూ.20 కోట్లు వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన IT కంపెనీ..
ABN , First Publish Date - 2022-05-31T11:39:32+05:30 IST
రూ.20 కోట్లు వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన IT కంపెనీ..
- లబోదిబోమంటున్న బాధితులు
హైదరాబాద్ సిటీ/మాదాపూర్ : ఉద్యోగం ఇస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష, రెండు లక్షలు వసూలు చేసిన సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు (SoftWare Company) తిప్పేసింది. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్లోని దివ్యశక్తి అపార్ట్మెంటులో ఇనోబీ టెక్నాలజీ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఉద్యోగులు కావాలని బ్యాక్డోర్ నుంచి ఒక్కొక్కరి నుంచి లక్ష, రెండు లక్షలు వసూలు చేశారు. శిక్షణ ఇచ్చి రెండు నెలలు వేతనం కూడా ఇచ్చారు.
తాజాగా.. అపార్ట్మెంటు వద్ద సంస్థ బోర్డు లేకపోవడంతో బాధితులు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. వరంగల్ జిల్లాకు చెందిన తాళ్లపల్లి హరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుమారు 800 మంది నుంచి రూ.20 కోట్లు వసూలు చేసినట్లు బాధితులు పేర్కొంటున్నారు. సంస్థ నిర్వాహకులు కమలేష్కుమారి, రాహుల్, ప్రదీప్ పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు.