TS News.. స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..: రేవంత్

ABN , First Publish Date - 2022-08-15T17:52:54+05:30 IST

బ్రిటిష్ వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందని...

TS News.. స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..: రేవంత్

హైదరాబాద్ (Hyderabad): బ్రిటిష్ (British) వారి నుంచి దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం నడిచిందని, పెద్ద ఎత్తున  ఉద్యమంలో పాల్గొన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy) అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day)  సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ  ఈ ఉద్యమంలో లక్షలాది మంది జైళ్ల పాలు అయ్యారని,  వేలాది మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు అందించి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేద్కర్, నెహ్రు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమాల ఫలితమే నేటి స్వాతంత్ర్యం అన్నారు. పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్యంతో ఒకవైపు ఆనందం. మరోవైపు దేశ విభజన విషాదం.. మత కల్లోలాలు వచ్చాయన్నారు. 


దేశ విభజన నేపథ్యంలో భారత్ తొలి ప్రధానిగా నెహ్రు దేశాన్ని ముందుకు తీసుకుపోవడంలో తన దూర దృష్టి, విజ్ఞానంతో ఎంతో కృషి చేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో 140 కోట్ల ప్రజలు 75 ఏళ్ల నుంచి హక్కులు, బాధ్యతలతో దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం, అభివృద్ధి, నైపుణ్యంతో దేశాన్ని శక్తి వంచన లేకుండా నెహ్రు దేశాన్ని ముందుకు నడిపారన్నారు. దేశం కోసం మహాత్మాగాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణ త్యాగాలు చేశారన్నారు. దేశాన్ని కడు పేదరికం నుంచి నేడు ప్రపంచంలో ఒక శక్తి వంతమైన దేశంగా నిర్మించడంలో కాంగ్రెస్ ప్రధాన మంత్రులు చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. దేశంలో ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించి ప్రజలను ఆత్మగౌరవంతో బ్రతికేలా తీర్చిదిద్దిన ఘనత వారిదేనన్నారు. అలాగే 60 ఏళ్లుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనన్నారు. కానీ నేడు మతతత్వ శక్తులు దేశంలో చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని విమర్శించారు. ఎన్నో పోరాటాలు, ఎంతో శ్రమకు ఓర్చి నిర్మించిన ఈ దేశంలో మళ్ళీ విభజించి లబ్ది పొందే చర్యలను మనం ప్రతిఘటించాలని పిలుపిచ్చారు. సోనియా. రాహుల్ గాంధీ నాయకత్వంలో పటిష్టమైన పోరాటంతో పనిచేయాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-08-15T17:52:54+05:30 IST