నిబంధనల ప్రకారమే రిపోర్టు: ఆర్డీఓ
ABN , First Publish Date - 2022-12-07T00:57:11+05:30 IST
అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కవాడిపల్లి గ్రామంలోని సర్వేనం. 67 విషయంలో నిబంధనల ప్రకారమే కలెక్టర్కు నివేదిక పంపించినట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ అనితా రెడ్డి స్పష్టంచేశారు.
హయత్నగర్, డిసెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కవాడిపల్లి గ్రామంలోని సర్వేనం. 67 విషయంలో నిబంధనల ప్రకారమే కలెక్టర్కు నివేదిక పంపించినట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ అనితా రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట అదనపు కలెక్టర్ తిరుపతిరావు ముందు ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ చేసిన కవాడిపల్లి గ్రామానికి చెందిన మహిళా జయశ్రీ అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ అనితారెడ్డిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తుర్కయంజాల్లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంకటాచారి, తహసీల్దార్అనితారెడ్డి విలేకరుల సమావేశంలో జయశ్రీ ఆరోపణలను ఖండించారు. సదరు సర్వేనంబర్లోని 5.25 గుంటల భూమిని జయశ్రీ కుటుంబ సభ్యులు ఇతరులకు విక్రయించారని తెలిపారు. ఆ భూమిపై వారికి ఎలాంటి హక్కులు లేవని.. సేల్ డీడ్తో కొనుగోలు చేసిన వారు పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకోకపోవడంతో పట్టాదారు పేర్లు రికార్డులో వస్తున్నాయని తెలిపారు. దానిని ఆసరా చేసుకొని జయశ్రీ తండ్రి భిక్షపతి నలుగురు కూతుర్ల పేర గిప్ట్డీడ్ చేశారని తెలిపారు. దీంతో వారు ఆ భూమికి హక్కుదారులమని వాదిస్తున్నారని తెలిపారు. లేని భూమి తమదంటూ వారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు.