సొంత నిర్ణయం తీసుకునే ధైర్యం స్పీకర్కు లేదు: రఘునందనరావు
ABN , First Publish Date - 2022-03-17T20:14:17+05:30 IST
ప్రభుత్వ కుట్రలో భాగంగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తమను సస్పెండ్ చేశారని రఘునందనరావు ఆరోపించారు.
హైదరాబాద్: ప్రభుత్వ కుట్రలో భాగంగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తమను సస్పెండ్ చేశారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సొంత నిర్ణయం తీసుకునే ధైర్యం సభాపతికి లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్లు కలసి పోటీచేయనున్నాయని జోస్యం చెప్పారు. భట్టి విక్రమార్కను ఏ పార్టీ నుంచి రాజ్యసభకు పంపుతారో చెప్పాలన్నారు.
తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడవాలంటే ప్రజలు సంఘటితం కావాలని రఘునందనరావు పిలుపిచ్చారు. కేసీఆర్పై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు వస్తుందన్నారు. దుబ్బాక.. హుజురాబాద్ ప్రజలు చూపిన చైతన్యాన్ని తెలంగాణ ప్రజలు అందిపుచ్చుకోవాలన్నారు. పీకేలు, ఏకే 47లు టీఆర్ఎస్ను కాపాడలేవన్నారు. పార్టీ అనుమతి తీసుకుని అన్ని కేంద్రాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షలు నిర్వహిస్తామన్నారు. నల్ల కండువాలు వేసుకుంటే సభ నుంచి సస్పెండ్ చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఒకరినొకరు పొగుడుకోవటానికి అసెంబ్లీ వేదికైందని రఘునందనరావు ఎద్దేవా చేశారు.