కళ్లలో కారం చల్లి.. తల నరికేశారు

ABN , First Publish Date - 2022-11-12T04:07:44+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. తమలో ఒకరిని చంపేశాడనే కారణంతో ఓ యువకుడిపై కక్ష పెంచుకున్న ఓ కుటుంబం అతన్ని కిరాతకంగా చంపేసింది.

కళ్లలో కారం చల్లి.. తల నరికేశారు

సంగారెడ్డి జిల్లాలో యువకుడి దారుణ హత్య

కుమారుడి హత్యకు ప్రతీకారం

అందరూ చూస్తుండగా ఘాతుకం

అనంతరం పోలీసు స్టేషన్‌లో లొంగుబాటు

మునిపల్లి, నవంబరు 11: సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. తమలో ఒకరిని చంపేశాడనే కారణంతో ఓ యువకుడిపై కక్ష పెంచుకున్న ఓ కుటుంబం అతన్ని కిరాతకంగా చంపేసింది. దారి కాచి ఆ యువకుని కళ్లలో కారం చల్లి.. గొడ్డలితో నరికి తలను మొండాన్ని వేరు చేసి ప్రతీకారం తీర్చుకుంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం చిన్నచెల్మెడలో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో బేగరి ఆనంద్‌(30) హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిన్నచెల్మెడకు చెందిన ఆనంద్‌ తాను అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కోపంతో రెండేళ్ల క్రితం తన తల్లిని హత్య చేశాడనే ఆరోపణలున్నాయి.

అయితే, 2020 నవంబరులో స్నేహితులతో కలిసి పేకాట ఆడుతుండగా జరిగిన గొడవలో అదే గ్రామానికి చెందిన తలారి పౌల్‌ అనే వ్యక్తిని ఆనంద్‌ హత్య చేశాడు. ఈ కేసులో జైలుపాలైన ఆనంద్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలై స్వగ్రామానికి వచ్చాడు. మూడు రోజుల క్రితం తన మిత్రుడు, గ్రామ మాజీ సర్పంచ్‌ గృహప్రవేశ కార్యక్రమానికి కూడా హాజరయ్యాడు. అనంతరం మద్యం మత్తులో గ్రామంలో తిరుగుతూ ఇంకో నలుగురిని చంపుతానంటూ జనాన్ని భయబ్రాంతులకు గురిచేశాడు. మరోపక్క, పౌల్‌ తండ్రి తలారి అంబయ్యతోనూ చనువుగా ఉంటున్నాడు. కానీ, అతని తీరుతో భయపడిపోయిన అంబయ్య.. ఆనంద్‌ను అంతమొందించి కొడుకు చావుకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. భార్య స్వరూప, కొడుకు ప్రేమ్‌దా్‌సతో కలిసి పథక రచన చేశాడు.

శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లొచ్చి మాజీ సర్పంచ్‌ ఇంటి ఎదుట నిలబడి ఉన్న ఆనంద్‌ కళ్లలో కారం చల్లారు. దీంతో అప్రమత్తమైన ఆనంద్‌ అక్కడి నుంచి పరుగెత్తుతుండగా వెనుక నుంచి అంబయ్య అతని మెడపై వేటు వేశాడు. అనంతరం రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆనంద్‌ను ఈడ్చుకొచ్చి తల నరికేశారు. ఆపై రెండు చేతులను కూడా వేరు చేశాడు. ఆనంద్‌ మరణించాడని నిర్ధారణకు వచ్చాక తమ ఇంటికెళ్లిన అంబయ్య, స్వరూప, ప్రేమ్‌దాస్‌ కాసేపటికి పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2022-11-12T04:07:45+05:30 IST