Telangana News: కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని ఎవరు ఏమి చేయలేరు: మల్లు రవి
ABN , First Publish Date - 2022-07-20T21:24:17+05:30 IST
గాంధీ, నెహ్రు కుటుంబాలను మోదీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టేందుకు కుట్రలు చేస్తోందని....
హైదరాబాద్ (Hyderabad): గాంధీ (Gandhi), నెహ్రు (Nehru) కుటుంబాలను మోదీ ప్రభుత్వం (Modi Govt.) ఇబ్బందులు పెట్టేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ నేత, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడో పాత కేసులను కొట్టి వేసిన ఈడీ (ED).. కేసులను తిరగదోడి విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. గాంధీ, నెహ్రు కుటుంబాలు త్యాగానికి ప్రతిరూపమని, డబ్బులకు, పదవులకు ఆశ పడకుండా దేశం కోసం పని చేశారని కొనియాడారు. పదవులను త్యాగం చేసిన కుటుంబాలను, ప్రజల కోసం పని చేసిన కుటుంబాలను మోదీ ప్రభుత్వం ఈడీ పేరుతో వేధిస్తోందని ఆరోపించారు. ఈ చవకబారు ఎత్తుగడలతో కాంగ్రెస్ పార్టీని, గాంధీ కుటుంబాన్ని ఎవరు ఏమి చేయలేరని అన్నారు.
సోనియా గాంధీ (Sonia Gandhi) తెలంగాణ (Telangana) ప్రజల ఆకాంక్షలను నెరవేర్చారని, ఇలాంటి సమయంలో తెలంగాణ సమాజం రాజకీయాలకు అతీతంగా సోనియా (Sonia)కు అండగా నిలవాలని మల్లు రవి పిలుపిచ్చారు. బీజేపీ (BJP) ప్రభుత్వం చేస్తున్న కక్ష పూరిత చర్యలను అందరూ ఖండించాలన్నారు. గురువారం సోనియా ఈడీ (ED) ఆఫీసుకు విచారణకు వెళ్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ ఉదయం 10 గంటలకు హైదరాబాద్, నెక్లెస్ రోడ్, ఇందిరమ్మ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు ర్యాలీ, ధర్నా నిర్వహిస్తామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth reddy), ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని మల్లు రవి తెలిపారు.