Raja Gopal Reddy resigns: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

ABN , First Publish Date - 2022-08-03T01:36:21+05:30 IST

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని చెప్పారు.

Raja Gopal Reddy resigns: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Raja Gopal Reddy) రాజీనామా చేశారు. తన నియోజకవర్గమైన మునుగోడు (Munugode) ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతోటే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఉప ఎన్నిక జరిగితేనే నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు ఇస్తుందనే ప్రచారం జరుగుతోందన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు. అయితే తెలంగాణలో టీఆర్ఎస్ అరాచకపాలన పోవాలంటే బీజేపీ వల్లే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్‌పై పోరాడలేకపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధతోటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఆయన... స్పీకర్ సమయం తీసుకుని రాజీనామా లేఖను అందజేస్తానని వెల్లడించారు. గెలుపోటముల్ని ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. విలేకరుల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. 


ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తుల కింద 20ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్న తాము ఎలా పనిచేయాలని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. సోనియాను గతంలో విమర్శించిన నాయకులు ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని, ఇంతకన్నా అవమానం ఉందా అని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి కంట్రోల్‌లో తాము ఎలా పనిచేస్తామని, బయటి నుంచి వచ్చిన వ్యక్తిని ఎలా సీఎం చేస్తామని రాజగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీ నాయకత్వంలో దేశం దూసుకుపోతోందని, దేశ ప్రజలంతా మోదీ వైపే చూస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. 


తెలంగాణ వ్యాప్తంగా పోడు భూముల సమస్య ఉందని, పోడు భూముల సమస్యకు ఇప్పటికీ పరిష్కారం లేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను గౌరవించే సంస్కారం ఈ ప్రభుత్వానికి లేదని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కేసీఆర్ కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వరని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని, తెలంగాణ శ్రీలంకగా మారే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, కేసీఆర్ చెప్పుచేతల్లోనే అధికార యంత్రాంగం ఉందని రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. 





Updated Date - 2022-08-03T01:36:21+05:30 IST