నాది కడప.. ఏం చేస్తారో చేసుకోండి
ABN , First Publish Date - 2022-04-18T17:49:59+05:30 IST
ఓ అభ్యర్థిని చితగొట్టిన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఉదంతమిది
అభ్యర్థిపై కోచింగ్ సెంటర్ డైరెక్టర్ దాడి
చిక్కడపల్లి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): ఓ అభ్యర్థిని చితగొట్టిన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఉదంతమిది. దిల్సుఖ్నగర్కు చెందిన సాయిచరణ్ పోటీ పరీక్షల నిమిత్తం అశోక్నగర్ వద్ద ఉన్న శిఖర కోచింగ్ సెంటర్కు వెళ్లాడు. ‘‘గ్రూప్ 2కు సంబంధించి ఇతర కోచింగ్ సెంటర్లలో డెమో క్లాస్లు విన్నాను. మీ సెంటర్లో కూడా డెమో క్లాస్లు ఉంటే చెప్పండి’’ అని కోరాడు. దీంతో రెచ్చిపోయిన కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఢిల్లీబాబు... ‘‘వివరాలు తెలుసుకోవడానికి ఏ కోచింగ్ సెంటర్ పక్షాన వచ్చావు?’’ అంటూ సాయిచరణ్ సెల్ఫోన్ లాక్కుని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ దాడిచేశాడు. దీంతో సాయిచరణ్ 100కు డయల్ చేయడంతో సమాచారం చిక్కడపల్లి పోలీసులకు చేరింది. అక్కడకు వచ్చిన కానిస్టేబుల్ విధి నిర్వహణకు అడ్డుపడుతూ నాది కడజ.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఢిల్లీ బాబు దాడి చేశాడు. కానిస్టేబుల్ జహంగీర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఢిల్లీబాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా, పోలీసులు ఆదివారం రాత్రి మెజిస్ట్రేట్ ఎదుట ఢిల్లీబాబును హాజరుపరిచారు. ఢిల్లీబాబు ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడం.. చేతులు, కాళ్లు, అరచేతులు కమిలిపోయి ఉండడాన్ని గమనించిన మెజిస్ట్రేట్ పోలీసులపై సీరియస్ అయినట్లు తెలిసింది. ‘‘ఇంతలా కొడుతారా?’’ అని ప్రశ్నించినట్లు సమాచారం.