వదిలి వెళ్లినా చంపేశాడు..
ABN , First Publish Date - 2022-05-18T16:54:28+05:30 IST
భర్త పెట్టే బాధలు భరించలేక కొడుకుతో మరో ఇంటికి వెళ్లి తలదాచుకున్నా వదలలేదు. ఎక్కడున్నారో తెలుసుకుని మరీ భార్యను గొంతుకోసి హతమార్చాడు..
భార్య గొంతుకోసిన భర్త
హైదరాబాద్/నార్సింగ్: భర్త పెట్టే బాధలు భరించలేక కొడుకుతో మరో ఇంటికి వెళ్లి తలదాచుకున్నా వదలలేదు. ఎక్కడున్నారో తెలుసుకుని మరీ భార్యను గొంతుకోసి హతమార్చాడు. ఈ ఘటన పుప్పాలగూడలో కలకలం రేపింది. నార్సింగ్ పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరికి చెందిన దుర్గాప్రసాద్, లక్ష్మీ(40) భార్యభర్తలు. బతుకు దెరువుకోసం నగరానికి వచ్చారు. పుప్పాలగూడలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. కూతురికి పెళ్లి చేశారు. కుమారుడు సినీ పరిశ్రమలో పని చేస్తున్నాడు. దుర్గా ప్రసాద్ ఇసుక లారీలో పని చేస్తుంటాడు. తరచూ తాగి భార్యను, కుమారుడుని కొట్టేవాడు.
అతడికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న తల్లీకొడుకులు పుప్పాలగూడలోనే మరో చోటికి మకాం మార్చారు. వారి ఆచూకీ తెలుసుకున్న దుర్గా ప్రసాద్ ఆదివారం అక్కడికి వెళ్లి భార్యతో గొడవ పడ్డాడు. ఆవేశంలో గొంతు కోసి హతమార్చాడు. ఇంటికి బయట నుంచి తాళం వేసి వెళ్లిపోయాడు. షూటింగ్ నుంచి మంగళవారం తిరిగి వచ్చిన కొడుకు తల్లి కోసం వెదికాడు. కనిపించకపోవడంతో తాళం పగులకొట్టి ఇంట్లోకి వెళ్లే సరికి తల్లి ఇంట్లో శవమై కనిపించింది. దీంతో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుర్గా ప్రసాద్ కోసం వెదుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.