Hyderabad Metro Stations: మెట్రో స్టేషన్లలో పావురాలతో పరేషాన్
ABN , First Publish Date - 2022-12-18T10:30:28+05:30 IST
మెట్రో స్టేషన్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. రోజువారీగా ప్రాంగణాలను శుభ్రం చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు
నిర్వహణను పట్టించుకోని ఎల్ అండ్ టీ
ప్లాట్ఫారాలు, ఎస్కలేటర్లపై పావురాల వ్యర్థాలు
ఎంజీబీఎస్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్ స్టేషన్లలో దుర్వాసన
హైదరాబాద్ సిటీ: మెట్రో స్టేషన్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. రోజువారీగా ప్రాంగణాలను శుభ్రం చేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కొన్ని ప్లాట్ఫారాలు, ఎస్కలేటర్లపై పావురాల వ్యర్థాలను రోజుల తరబడి తొలగించకపోవడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ఎల్ అండ్ టీ అధికారులకు కొందరు ప్రయాణికులు లిఖిత పూర్వకంగా, ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు.
పావురాలతో పరేషాన్
పెరిగిన ప్యాసింజర్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని బోగీల సంఖ్య పెంచే దిశగా ఆలోచిస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్, ఎల్ అండ్ టీ అధికారులు స్టేషన్లలో కనీస సౌకర్యాలు, పారిశుధ్య పనులపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌంటర్లలో టికెట్లు తీసుకొని ఎస్కలేటర్లు ఎక్కి ప్లాట్ఫారంపైకి వెళ్లేలోపు పావురాలు ప్యాసింజర్లపై వ్యర్థాలు వదులుతుండడంతో తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఆఫీ్సలకు వెళ్తున్న సమయంలో షర్టులు, ప్యాంట్లు పాడవుతుండడంతో కొందరు ఇంటిబాట పడుతున్నారు. ఎంజీబీఎస్, ముషీరాబాద్, గాంధీ ఆస్పత్రి, ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లి, సికింద్రాబాద్, మెట్టుగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు పావురాలతో నిత్యం పరేషాన్ అవుతున్నారు.