కమలం జోష్
ABN , First Publish Date - 2022-07-04T16:39:51+05:30 IST
బీజేపీ విజయ సంకల్ప సభ నగర కేడర్లో జోష్ నింపింది. సభ విజయవంతం కావడం ఉత్సాహాన్నిచ్చింది. ఆదివారం ఉదయం నుంచే కమలనాథులు
సభ సక్సెస్ తో శ్రేణుల్లో ఆనందం
ఉదయం నుంచే.. పరేడ్ గ్రౌండ్ బాట
సభా ప్రాంగణం బయటా జనాలే
జన సమీకరణలో సక్సెస్ అయిన నేతలు
బీజేపీ విజయ సంకల్ప సభ నగర కేడర్లో జోష్ నింపింది. సభ విజయవంతం కావడం ఉత్సాహాన్నిచ్చింది. ఆదివారం ఉదయం నుంచే కమలనాథులు పరేడ్గ్రౌండ్ బాట పట్టారు. కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. నిర్ణీత సమయం కంటే ముందే అక్కడకు చేరుకున్నారు. గ్రౌండ్ లోపలికి వెళ్లడానికి పోలీసులు అనుమతించకపోవడంతో జేబీఎస్ ఎదుట రోడ్ల మీదనే వేచి ఉన్నారు. సాయంత్రం ఆట పాటలు, నినాదాలు చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పరేడ్ గ్రౌండ్లోనే కాకుండా బయట కూడా జనం కనిపించారు.
హైదరాబాద్ సిటీ/సికింద్రాబాద్:
సభ సాగిందిలా..
సాయంత్రం వరకూ జనం బయటే ఉండడంతో ఆ ప్రాంతం కార్యకర్తలతో కిటకిటలాడింది.
సాయంత్రం నాలుగు గంటల నుంచే పరేడ్గ్రౌండ్లో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు సభకు చేరుకున్నారు.
సాయంత్రం 4.19 గంటలకు సభ ప్రారంభమైంది.
4.39 గంటలకు ఎంపీ సోయం బాబూరావు ప్రసంగం ప్రారంభమైంది.
సాయంత్రం 5 గంటలకే సభా ప్రాంగణం రద్దీగా కనిపించింది.
నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మెదక్ నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు.
బీజేపీ జెండాలు, బ్యానర్లు, ప్రధాని కటౌట్లతో ఆ ప్రాంతం కాషాయమయమైంది.
ఆదిలాబాద్కు చెందిన ఓ కార్యకర్త ప్రధాని వేషధారణలో ఆకట్టుకున్నారు.
కొందరు మహిళలు, యువతులు బోనాలతో నృత్యాలు చేసుకుంటూ పరేడ్గ్రౌండ్కు చేరుకున్నారు.
5.10 గంటలకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మాట్లాడారు.
5.19 గంటలకు జైౖ తెలంగాణ, జై శ్రీరామ్ అంటూ ఈటల రాజేందర్ ప్రసంగాన్ని ప్రారంభించారు.
5.45 గంటలకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రసంగిస్తుండగా వేదికపైకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ వచ్చారు.
5.58 గంటలకు అమిత్షా ప్రసంగం ప్రారంభమైంది.
6.09 గంటలకు అమిత్షా ప్రసంగం ముగియగానే కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీ కండువా కప్పుకుంటారని ప్రకటించారు.
6.10 గంటలకు హెలికాఫ్టర్లు కనిపించడంతో మోదీ వస్తున్నారని పార్టీ శ్రేణులు, ప్రజలు లేచి నిల్చుని, చేతులు ఊపారు.
6.12 గంటలకు విజయశాంతి చేరుకోగానే సభలో కరతాళధ్వనులు మిన్నంటాయి.
6.30 గంటలకు పీయూ్షగోయల్ ప్రసంగిస్తుండగా ప్రధాని మోదీ కాన్వాయ్ గ్రౌండ్లోకి ప్రవేశించింది.
6.35 గంటలకు మోదీ వేదికపై కాలు మోపగానే అందరిలో ఉత్సాహం వెల్లివిరిసింది.
6.35 గంటలకు బండి సంజయ్ ప్రసంగం ప్రారంభమైంది.
6.52 గంటలకు జే.పీ.నడ్డా ప్రసంగం ప్రారంభమైంది.
7.00 గంటలకు వ్యక్తిగత సిబ్బంది తీసుకువచ్చిన వాటర్ బాటిల్లోని మంచినీళ్లు తాగిన మోదీ ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
7.27కు మోదీ ప్రసంగం ముగిసింది.
సభ సక్సెస్ కావడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేదికపై రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను అభినందించారు.
ప్రతిభకు హైదరాబాద్ పట్టం కడుతుందని ప్రశంసించడంతో చప్పట్లు హోరెత్తాయి.
జనం మోదీ.. మోదీ.. అంటూ నినదించారు. ఫలించిన సభలు.. సమావేశాలు
కార్యవర్గ సమావేశాలకు ముందు గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీ నేతలు నిర్వహించిన నియోజకవర్గాల వారీ సమావేశాలు ఫలితానిచ్చాయి. గురువారం రాత్రి నుంచి బీజేపీ అగ్రశేణి నాయకులు పలు కమ్యూనిటీలు, సంఘాలతో సమావేశమయ్యారు. ఇళ్లల్లో భోజనాలు చేస్తూ కార్యకర్తలను ఉత్తేజపర్చారు. సభకు అధిక సంఖ్యలో జనం తరలించడంలో నేతలు సక్సెస్ అయ్యారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ స్థాయిలో బీజేపీ నియోజకవర్గాల సమావేశాలు నిర్వహించడం ఇదే మొదటి సారి.