పీసీసీ అధ్యక్షుడులా రేవంత్ మాట్లాడటం లేదు: గువ్వల బాలరాజు
ABN , First Publish Date - 2022-03-14T21:24:51+05:30 IST
టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడులా మాట్లాడడంలేదని, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునే బ్రోకర్లా మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్-టీడీపీ ప్రభుత్వాల వల్ల పాలమూరుకు ఏమైనా ప్రయోజనం జరిగిందా? అని ప్రశ్నించారు. కొడంగల్లో పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిన రేవంత్ గతం మర్చిపోయి మాట్లాడుతున్నారన్నారు. కేంద్రంపై మాట్లాడేందుకు రేవంత్ రెడ్డి గజగజ ఓనికిపోతున్నారని, వ్యాపారాలు చేసుకునేందుకు టీపీసీసీ పదవిని వాడుకుంటున్నారని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే రేవంత్ రెడ్డికి పడదని, ఆయనకు దమ్ముంటే ప్రాజెక్టులపై తమ ఎమ్మెల్యేలతో చర్చకు రావాలని గువ్వల బాలరాజు సవాల్ చేశారు. పోరు అనేది ఎలా ఉంటుందో టీఆర్ఎస్ పార్టీని చూసి రేవంత్ నేర్చుకోవాలన్నారు. మళ్లీ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి గెలిచే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఎక్కడ నిలబడ్డా- అక్కడ పాపులారిటీ లేని వ్యక్తిని పెట్టి ఒడిస్తామన్నారు. దళితులపై-ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని గువ్వల బాలరాజు డిమాండ్ చేశారు.