కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-01-21T17:48:39+05:30 IST
కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్నగర్
హైదరాబాద్/జవహర్నగర్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పరిధిలోని అంబేడ్కర్నగర్లో గురువారం జరిగింది. సీఐ చంద్రశేఖర్ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన లక్ష్మణ్ స్థానికంగా కొబ్బరి బొండాలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతడికి భార్య అనూష, ముగ్గురు కుమారులు, ఒక కూతురు. పెద్ద కుమారుడు పునీత్(9 ఏళ్లు)కి వారం క్రితం ఫిట్స్ రావడంతో నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తుండగా బుధవారం మృతిచెందాడు. కాగా, గురువారం అతడి దహన సంస్కారాలు నిర్వహించి లక్ష్మణ్ ఇంటికి వచ్చాడు. అయితే కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ రెండో కుమారుడు చనిపోవడం, ఇప్పుడు పెద్ద కొడుకు ఆకస్మికంగా మరణించడంతో తట్టుకోలేని లక్ష్మణ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.