అమరుల బలిదానాలకు ‘చంద్ర’గ్రహణం
ABN , First Publish Date - 2022-11-30T03:42:31+05:30 IST
దీక్షా దివస్ సందర్భంగా మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,..
వీరుల త్యాగాలు.. కేసీఆర్ ఫ్యామిలీ భోగాలు..
ఎమ్మెల్సీ కవిత ట్వీట్కు రేవంత్ కౌంటర్
హైదరాబాద్, నవంబరు 29 : దీక్షా దివస్ సందర్భంగా మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మధ్య ట్విటర్ వేదికగా వార్ నడిచింది. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్నించిన కవిత.. సోనియా, ప్రియాంకాగాంధీ చేత బతుకమ్మను ఎత్తించిన ఘనత తెలంగాణ బిడ్డలదని అన్నారు. ఆ ట్వీట్కు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘‘వంటావార్పులో పప్పన్నం తిన్నందుకు, బోనం ఎత్తినందుకు, బతుకమ్మ ఆడినందుకే మీ ఇంటిల్లిపాది పదవులు, భోగభాగ్యాలు అనుభవిస్తుంటే.. తెలంగాణ కోసం చిరునవ్వుతో ప్రాణాలు వదిలిన శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యల త్యాగాలను ఏమనాలి..? అమర వీరుల బలిదానాలకు ‘చంద్ర’గ్రహణంలా దాపురించిన మీ కుటుంబానికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది. త్యాగాలు చేసిందెవరు..? భోగాలు అనుభవిస్తోంది ఎవరని తెలంగాణ ఘోషిస్తోంది. అధికార మదంతో మూసుకుపోయిన మీ కళ్లు, చెవులకు అవి కనబడవు, వినబడవు’’ అని ట్వీట్ చేశారు.