మలక్పేటలో డయాలసిస్ సేవలు భేష్
ABN , First Publish Date - 2022-04-23T17:56:59+05:30 IST
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మలక్పేట ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలందిస్తున్నారు. 24 అక్టోబర్ 2017లో ఐదు పడకలతో ప్రారంభమైన
పది యంత్రాలతో రోజుకు 45 మందికి చికిత్స
53 నెలల్లో 30 వేల మందికి సేవలు
హైదరాబాద్/సైదాబాద్: కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా మలక్పేట ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలందిస్తున్నారు. 24 అక్టోబర్ 2017లో ఐదు పడకలతో ప్రారంభమైన ఈ కేంద్రంలో ఇప్పటి వరకు 30వేల మంది డయాలసిస్ సేవలు పొందారు. ప్రస్తుతం పది యంత్రాలతో రోజుకు 40 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నారు. రోగులు ఆస్పత్రిలో సేవలు, సిబ్బంది పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతీసారి కొత్త డయలైజర్
రోగి రక్తశుద్ధ్ది ప్రకియలో డయలైజర్ కిట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది బహిరంగ మార్కెట్లో రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ఉంటుంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకునే రోగులకు ఒక్కో డయలైజర్ రెండు నుంచి నాలుగుసార్లు వాడతారు. దీంతో రోగులకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. మలక్పేట ఆస్పత్రిలోని డయాలసిస్ కేంద్రంలో ప్రతీసారి కొత్త డయలైజర్ వాడటంతో రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నెఫ్రాలజిస్ట్ డాక్టర్ను నియమించాలి
డయాలసిస్ రోగులను పరీక్షించే వైద్యుడు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. దీంతో ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వద్ద పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. లేకుంటే వేరే ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికైనా నెఫ్రాలజిస్ట్ డాక్టర్ను రోగులకు అందుబాటులో తీసుకువస్తే బాగుంటుంది.
- యాదగిరి, ఘట్కేసర్
సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ
సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుండటంతో భయం లేకుండా చికిత్స చేయించుకుంటున్నాం. ఈ డయాలసిస్ కేంద్రంలో సౌకర్యాలు బాగున్నాయి. ముందుగా కేటాయించిన సమయం ప్రకారం నేరుగా వచ్చి రక్తం శుద్ధ్ది చేసుకుని వెళ్తాం. అవసరమైన సలహాలు, సూచనలు సిబ్బంది ఇస్తున్నారు.
- అబ్దుల్, బార్కాస్
ప్రైవేటు ఆస్పత్రుల కంటే మేలు..
కొన్ని నెలలుగా మలక్పేట కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటున్నా. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒకే డయలైజర్ మూడు, నాలుగు సార్లు వాడుతారు. ఇక్కడ ప్రతీ ఒక్కరికి కొత్త డయలైజర్ వాడుతున్నారు. కేంద్రం నిర్వహణ సైతం బాగుంది. ఇక్కడి సేవలు ప్రైవేటు ఆస్పత్రుల్లో కంటే మెరుగ్గా ఉన్నాయి.
- రాజు, ఎల్బీనగర్
24 గంటలు సేవలు..
ఈ కేంద్రంలో 24 గంటలు కిడ్నీ రోగులకు మెరుగైన సేవలందిస్తున్నాం. బాధితులు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ముందస్తుగా సమయం కేటాయిస్తున్నాం. పది యంత్రాలతో ఒక్కొక్కరికి నాలుగు గంటల చొప్పున రక్తశుద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రతీ రోజు నాలుగు విడతలుగా 40 మందికి సేవలందిస్తున్నాం.
-అజయ్ చౌదరి, డయాలసిస్ కేంద్రం ఇన్చార్జి