Hyderabad City: డీఏవీ స్కూల్‌ పునఃప్రారంభం

ABN , First Publish Date - 2022-11-04T10:44:47+05:30 IST

బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 14లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. రెండు వారాల స్వల్ప విరామం అనంతరం విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వాహకులు

Hyderabad City: డీఏవీ స్కూల్‌ పునఃప్రారంభం

హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 14లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ ఎట్టకేలకు గురువారం ప్రారంభమైంది. రెండు వారాల స్వల్ప విరామం అనంతరం విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వాహకులు పాఠశాలను తెరిచారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలకు వచ్చి తరగతి గదులకు వెళ్లారు. చాలా మంది తల్లిదండ్రులు గతంలో మాదిరిగా ఆటోలు, బస్సుల్లో పంపించకుండా స్వయంగా వారే వాహనాలపై వచ్చి పిల్లలను స్కూల్‌ లోపలికి భయంభయంగా పంపించారు. సాయంత్రం పాఠశాలకు వచ్చి పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. స్కూల్‌లో చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌ లైంగికదాడికి పాల్పడడంతో అక్టోబర్‌ 20న పాఠశాలను మూసివేసిన సంగతి తెలిసిందే. మెజార్టీ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది వరకు తరగతులు పునరుద్ధరించాలని నిర్ణయుంచిన విద్యాశాఖ గురువారం నుంచి పాఠశాల ప్రారంభానికి అనుమతిచ్చింది. చిన్నారి ఘటనను దృష్టిలో ఉంచుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు పాఠశాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆటోల్లో వచ్చిన పిల్లలను, డ్రైవర్ల కదలికలను గమనించారు. పిల్లలను పాఠశాలలోకి పంపించిన తల్లిదండ్రులు దాదాపు గంట వరకు అక్కడే ఉన్నారు. పలు దఫాలుగా నిర్వాహకులు తల్లిదండ్రులతో సమావేశమై వారి అనుమానాలను నివృత్తి చేశారు. తరగతుల నిర్వహణ ఎలా జరుగుతుందనే దానిపై తల్లిదండ్రులకు సీసీ కెమెరాల ద్వారా చూపించారు. తల్లిదండ్రుల సూచనలను, సలహాలను తప్పకుండా అమలు చేస్తామని నిర్వాహకులు భరోసా ఇచ్చారు. స్కూల్‌ పునరుద్ధరణ తర్వాత ప్రతి క్లాస్‌లో 60 నుంచి 80 శాతం మంది హాజరయ్యారు. సాయంత్రం స్కూల్‌ గేటు మూసే వరకు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడే విధులు నిర్వహించారు.

బాధితుల ఆందోళన

తమకు న్యాయం చేయకుండా పాఠశాలను ఎలా తెరుస్తారని బాధిత చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో ఉదయం ఆందోళన చేపట్టారు. యాజమాన్యం తమ గోడు వినిపించుకోలేదంటూ ఆరోపించారు. నిందితులకు శిక్ష పడే వరకూ పాఠశాలను తెరవద్దని డిమాండ్‌ చేశారు. నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని నిలువరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితులకు శిక్ష పడేలా కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు పోలీసులు హామీ ఇవ్వడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2022-11-04T10:44:49+05:30 IST