అడ్డదారులు తొక్కితే క్రిమినల్ కేసులు..
ABN , First Publish Date - 2022-12-10T03:21:32+05:30 IST
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు వసూలు చేసే వారి విషయంలో అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ నియామక బోర్డు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బు వసూలు చేసే వారి విషయంలో అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ నియామక బోర్డు ఉన్నతాధికారులు హెచ్చరించారు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన శరీర దారుఢ్య పరీక్షల్లో 12 కేంద్రాల్లో వేలాది అభ్యర్ధులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఉన్నతాధికారులు, నాయకులతో పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగం ఇప్పిస్తామని కొందరు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని, అభ్యర్ధులు అప్రమత్తంగా ఉండాలని బోర్డు అధికారులు తెలిపారు. నియామకాలు పూర్తి పారదర్శకంగా కొనసాగేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని స్పష్టం చేశారు. అభ్యర్ధులు మాయమాటలు నమ్మి అడ్డదారి తొక్కితే కొలువుకు అనర్హులుగా ప్రకటించడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. మోసం చేసేందుకు ప్రయత్నిస్తే తమ దృష్టికి తేవాలని నియామక బోర్డు అధికారులు సూచించారు.