సూపర్ న్యూమరరీపోస్టులు సృష్టించి ఏపీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించండి
ABN , First Publish Date - 2022-11-21T03:59:10+05:30 IST
ఏపీ నుంచి వచ్చిన 84 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు తెలంగాణ ఉద్యోగులకు రివర్షన్ ఇచ్చే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాంమనోహర్, ప్రధాన కార్యదర్శి మేడి రమేష్ అన్నారు.
తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లు వెనక్కు తీసుకుంటే పోరాటం
ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం హెచ్చరిక
హైదరాబాద్ సిటీ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏపీ నుంచి వచ్చిన 84 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు తెలంగాణ ఉద్యోగులకు రివర్షన్ ఇచ్చే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాంమనోహర్, ప్రధాన కార్యదర్శి మేడి రమేష్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాం మనోహర్ మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు అదేశాలతో ఏపీ నుంచి వచ్చిన 84 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు తెలంగాణ ఉద్యోగులకు రివర్షన్ ఇచ్చే దిశగా యాజమాన్యం అలోచిస్తోందన్నారు. దీంతో స్వరాష్ట్రంలో ఉద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితులు కన్పిస్తున్నాయన్నారు. ప్రత్యామ్నాయ మార్గంగా విద్యుత్తుసంస్థల్లో సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారికి పదోన్నతులు ఇచ్చి జీతాలు చెల్లిస్తే సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. విద్యుత్తు సంస్థల్లో ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరిగినా మెరుపుసమ్మెకు దిగుతామని హెచ్చరించారు. విద్యుత్తు సంస్థల్లో వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. మేడి రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా యాజమాన్యాలు నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరిగితే ధర్నాలు, సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. సమావేశంలో అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.చంద్రయ్య, నేతలు నాగరాజు, పి.ఆనంద్బాబు, బీచుపల్లి, తదితరులు పాల్గొన్నారు.