ఉద్యోగాల పేరుతో వసూళ్లు.. మహిళపై కేసు
ABN , First Publish Date - 2022-12-31T00:41:47+05:30 IST
తనకు చాలామంది ప్రభుత్వ అధికారులు తెలుసని, వారితో చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మభ్యపెట్టి యువకుల నుంచి రూ. 6.5 లక్షలు వసూలు చేసిన ఓ మహిళ చేతులెత్తేసింది.
రాజేంద్రనగర్, డిసెంబర్ 30(ఆంధ్రజ్యోతి): తనకు చాలామంది ప్రభుత్వ అధికారులు తెలుసని, వారితో చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మభ్యపెట్టి యువకుల నుంచి రూ. 6.5 లక్షలు వసూలు చేసిన ఓ మహిళ చేతులెత్తేసింది. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.... బండ్లగూడలో నివాసముండే మంజులరాణి కుమారుడికి అదే ప్రాంతంలో ఉండే ఆంజనేయులు ట్యూషన్ చెప్పేవాడు. మంజుల అతడితో మంచిగా మాట్లాడేది. తాను గతంలో ఆర్మీలో, గండిపేట్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేశానని నమ్మించింది. తనకు తెలిసిన వారి ద్వారా ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించింది. నమ్మిన ఆంజనేయులు అతడి స్నేహితులు వసంత్, మారుతి రూ.6.5 లక్షల వరకు ఆమెకు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె తన నివాసాన్ని బండ్లగూడ నుంచి వనస్థలిపురానికి మార్చింది. ఆంజనేయులు ఎన్నిసార్లు డబ్బు గురించి అడిగినా దాటేసేది. దీంతో విసిగిపోయిన బాధితులు మంజులరాణిపై రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తమ డబ్బులు ఇప్పించాలని వారు పోలీసులను కోరుతున్నారు. ఈ విషయమై ఎస్ఐ ఖలీల్పాషాను వివరణ కోరగా మంజుల రాణిపై కేసు నమోదు చేశామని, ఆమె కొంత డబ్బు యువకులకు ఇచ్చిందని తెలిపారు.