CM KCR: త్వరలో మానుకోటలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

ABN , First Publish Date - 2022-11-14T03:14:24+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లాలో త్వరలో లక్ష మందితో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ తెలిపారు.

CM KCR: త్వరలో మానుకోటలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ

లక్ష మందితో నిర్వహణ: మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి

మహబూబాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మహబూబాబాద్‌ జిల్లాలో త్వరలో లక్ష మందితో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం మానుకోటలో మంత్రులతోపాటు ఎంపీ, టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాలోతు కవిత, జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, కలెక్టర్‌ శశాంక, ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ పలు చోట్ల స్థలాలను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని నూతన మెడికల్‌ కళాశాల, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం, ఇల్లందు, కురవి రోడ్లు, సాలార్‌తండా వద్ద బహిరంగ సభ కోసం పరిశీలన చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడారు. సీఎం ఈ నెల చివర్లో లేదా డిసెంబరు మొదటి వారంలో వచ్చే అవకాశముందని, ఈ సందర్భంగా సమీకృత కలెక్టర్‌ కార్యాలయం, టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారన్నారు. మహబూబాబాద్‌లో రూ.560 కోట్లతో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు. రూ.62.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంతో ప్రజలకు సుపరిపాలన అందనుందని చెప్పారు. వైద్య కళాశాలతో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందనుందన్నారు. గిరిజన జిల్లా అయిన మానుకోటలో వైద్య, నర్సింగ్‌ కళాశాలల ఏర్పాటు ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.

Updated Date - 2022-11-14T11:08:18+05:30 IST