నేటి నుంచి పుస్తక ప్రదర్శన

ABN , First Publish Date - 2022-08-16T06:38:30+05:30 IST

చరఖాను చూడటమేగానీ, దాని మీద నూలు వడకడం ఎలాగో చాలామందికి తెలియదు. గానుగ గురించి వినడమేగానీ,

నేటి నుంచి పుస్తక ప్రదర్శన

75 ఏళ్ల స్వాతంత్య్ర సంబురాల సందర్భంగా   ‘వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన’ పేరుతో తెలంగాణ సాహిత్య అకాడమీ మంగళవారం నుంచి సోమవారం వరకు ఎల్బీ స్టేడియంలో పుస్తక మహోత్సవం నిర్వహించనుంది. అందులో మహాత్ముడి బోధనల తాలూకూ 3,000 పుస్తకాల ప్రదర్శన అదనపు ఆకర్షణ.


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): చరఖాను చూడటమేగానీ, దాని మీద నూలు వడకడం ఎలాగో చాలామందికి తెలియదు. గానుగ గురించి వినడమేగానీ, తద్వారా నూనెతీసే పద్ధతి చూసుండరు. మహాత్ముడు బోధించిన సుస్థిర వ్యవసాయం, ప్రకృతి వైద్యం తదితర అంశాల గురించి గూగుల్‌లో వెతికినా అరకొర సమాచారమే దొరుకుతుంది. ఈ విషయాలన్నింటినీ తెలుసుకోవాలంటే ఎల్బీ స్టేడియంలోని వజ్రోత్సవ పుస్తక ప్రదర్శనను సందర్శించవచ్చు. మహాత్ముడి ఆలోచనలను యువతరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ కలిసి వారంపాటు పుస్తక మహోత్సవాన్ని తలపెట్టారు. అందులో బాపూజీ బోధనల తాలూకూ సుమారు 3,000 పుస్తకాలను ప్రదర్శనకు ఉంచనున్నారు. అహింసామార్గంలో స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుకు నడిపిన మహాత్ముడి జీవిత విశేషాల ఛాయాచిత్రాలు కొలువుదీరనున్నాయి. 

50 స్టాళ్లు

తెలుగు అకాడమీ, ఎమెస్కో, నవచేతన, ప్రజాశక్తి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మిళింద్‌ ప్రకాశన్‌ వంటి తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్ల ప్రచురణ సంస్థలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి. స్వాతంత్ర్యోద్యమ వైతాళికుల జీవిత చరిత్రలు, జాతీయోద్యమ చరిత్ర తదితర అరుదైన పుస్తకాలతో యాభై స్టాళ్లు ఉంటాయని నిర్వాహకుడు కోయ చంద్రమోహన్‌ చెప్పారు. అంత సులువుగా దొరకని అరుదైన పుస్తకాలు ఈ ప్రదర్శనలో లభ్యమవుతాయని చెప్పారు. కుటీర పరిశ్రమ ఉత్పత్తులు, ఖాదీ వస్త్రాల క్రయవిక్రయాలు అదనం. వజ్రోత్సవ పుస్తక ప్రద్శనను మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, వజ్రోత్సవ కమిటీ చైర్మన్‌ కె. కేశవరావు ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శించవచ్చు. ప్రవేశం ఉచితమని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. 

Updated Date - 2022-08-16T06:38:30+05:30 IST