మా బస్తీకి రావొద్దు.. TRS మహిళా కార్పొరేటర్కు దండం పెట్టిన బస్తీవాసులు
ABN , First Publish Date - 2022-06-09T15:39:26+05:30 IST
మా బస్తీకి రావొద్దు.. TRS కార్పొరేటర్కు దండం పెట్టిన బస్తీవాసులు

హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : పట్టణ ప్రగతిలో అడ్డగుట్ట డివిజన్ కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మికి చేదు అనుభవం ఎదురైంది. కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ముగించుకొని వెళ్లిపోయారు. ఈ ఘటన ఆజాద్ చంద్రశేఖర్నగర్ బస్తీలో జరిగింది. కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి, ఆమె భర్త శ్రీనివాస్, ఆజాద్ చంద్రశేఖర్నగర్ బస్తీకి చెందిన టీఆర్ఎస్ నాయకుడు పెండెం మనోహర్, టీఆర్ఎస్ నాయకులు అడ్డగుట్ట కిష్టయ్య హోటల్ నుంచి ఆజాద్ చంద్రశేఖర్నగర్ బస్తీకి పట్టణ ప్రగతి బ్యానర్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆజాద్ చంద్రశేఖర్నగర్ బస్తీలోకి వారు వెళ్లగానే.. సుమారు వందమందికిపై ప్రజలు.. బస్తీలో వివాదంలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయ స్థలాన్ని పెండెం మనోహర్ కబ్జాచేశారని ఆరోపిస్తూ అడ్డుకున్నారు.
బస్తీలో కమ్యూనిటీహాల్ను ఎందుకు కూల్చివేశారని నిలదీశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను బస్తీ వాసులకు ఇవ్వకుండా బినామీ పేర్లతో మనోహర్ పట్టాలు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు పథకంలో బస్తీలో అవకతవకలు జరిగాయని కార్పొరేటర్సహా టీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నక్కా మధు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపజేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు నక్కా మధు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగు దశరథ్, బస్తీ నాయకుడు ఓర్సు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
