Jawaharnagar Dumping Yard: బయో మైనింగ్‌కు బ్రేక్‌!

ABN , First Publish Date - 2022-11-18T12:40:49+05:30 IST

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో వ్యర్థాల బయోమైనింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. నేషనల్‌ గ్రీన్‌

Jawaharnagar Dumping Yard: బయో మైనింగ్‌కు బ్రేక్‌!

జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డ్‌ క్యాపింగ్‌పై సీపీసీబీ పరిశీలన

ఎన్‌జీటీ ఆదేశాలతో రంగంలోకి

ముంబై ఐఐటీ ప్రొఫెసర్లకు అధ్యయన బాధ్యతలు

హైదరాబాద్‌ సిటీ: జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డులో వ్యర్థాల బయోమైనింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆదేశాలతో క్యాపింగ్‌ సక్రమంగా జరిగిందా.. లేదా..? అన్నది ప్రస్తుతం తేల్చాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి అప్పగించినట్టు ఓ అధికారి తెలిపారు. గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన సమగ్ర వ్యర్థాల నిర్వహణ నిబంధనల మేరకు క్యాపింగ్‌ చేశామని, బయో మైనింగ్‌కు టెండర్‌ పిలిచినా.. పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న జీహెచ్‌ఎంసీ వినతిపై ఎన్‌జీటీ పరిశీలనకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో సీపీబీసీ బృందం డంపింగ్‌ యార్డు వద్దకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వారిచ్చే నివేదిక ఆధారంగా బయో మైనింగ్‌ అవసరమా..? ఇప్పటికే పూర్తయిన క్యాపింగ్‌తో ఇబ్బంది లేదా..? అదనపు చర్యలు చేపట్టాలా..? అన్నది తేలనుంది. ఇప్పటికే ముంబై ఐఐటీ ప్రొఫెసర్లకు డంపింగ్‌ యార్డులో ప్రస్తుత పరిస్థితిపై అధ్యయన బాధ్యతలను జీహెచ్‌ఎంసీ అప్పగించింది.

క్యాపింగ్‌పై ఎన్‌జీటీ అసంతృప్తి

జవహర్‌నగర్‌లోని 339 ఎకరాల స్థలాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్‌ యార్డు కోసం గతంలో కేటాయించింది. దశాబ్దంన్నర నుంచి గ్రేటర్‌లో వెలువడే వ్యర్థాలు అక్కడికి తరలిస్తున్నారు. 2007 నుంచి 2012 వరకు నిర్వహణ లేకుండా డంప్‌ చేయడంతో చెత్త గుట్టలుగా పేరుకుపోయింది. వ్యర్థాల శాస్ర్తీయ నిల్వ, నిర్వహణకు 2009లో ఓ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్న పలు కారణాలతో 2012 వరకు అమలులోకి రాలేదు. అప్పటి నుంచి వ్యర్థాల నిర్వహణ మొదలైనా.. అంతకుముందు 125 ఎకరాల్లో పేరుకుపోయిన చెత్త నుంచి దుర్వాసన, హానికర ద్రవ్య వ్యర్థాలు(లీచెట్‌) రావడం మొదలైంది. దీంతో అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో చెత్త గుట్టలోకి వరద నీరు చేరి.. లీచెట్‌ మరింత పెరిగేది. ఈ క్రమంలో అక్కడి భూగర్భంతోపాటు పరిసర ప్రాంతాల్లోని చెరువులు కలుషితమయ్యాయి. దీంతో డంపింగ్‌పై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సమస్యకుపరిష్కారంగా రూ. 140 కోట్లతో క్యాపింగ్‌ చేశారు. క్యాపింగ్‌పై ఎన్‌జీటీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేసింది. క్యాపింగ్‌ సరికాదు.. వ్యర్థాలను బయో మైనింగ్‌ చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఎన్‌జీటీ ఆదేశాలతో బయో మైనింగ్‌ కోసం జీహెచ్‌ఎంసీ టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించగా.. పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మరోసారి ఎన్‌జీటీ తలుపు తట్టింది.

పరిశీలించి నివేదిక ఇవ్వండి : ఎన్‌జీటీ

బయో మైనింగ్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొంటు.. గతంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే క్యాపింగ్‌ చేశామని, లీచెట్‌ శుద్ధి కూడా పూర్తిస్థాయిలో చేపడుతున్నామని వివరిస్తూ ఎన్‌జీటీలో జీహెచ్‌ఎంసీ అప్పీల్‌ చేసింది. స్పందించిన ఎన్‌జీటీ డంపింగ్‌ యార్డు వద్ద పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. జవహర్‌నగర్‌కు వచ్చే సీపీసీబీ బృందం క్యాపింగ్‌ ఎలా చేశారు..? నిబంధనల ప్రకారం పనులు జరిగాయా..? క్యాపింగ్‌ పూర్తయిన అనంతరం పరిస్థితి ఎలా ఉంది..? పరిసర ప్రాంతాల్లోని భూగర్భ, జల వనరులు కలుషితమవుతున్నాయా..? అన్నది పరిశీలించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

వారిచ్చే నివేదిక ఆధారంగా బయో మైనింగ్‌ చేయాల్సిందేనా..? అవసరం లేదా..? అన్నది ఎన్‌జీటీ తేల్చనుంది. ఇందులో క్యాపింగ్‌ నిబంధనల ప్రకారం జరిగిందా..? లేదా..? అన్నది కీలకం కానుంది. ఇదిలా ఉంటే.. బయో మైనింగ్‌ సాధ్యాసాధ్యాల అధ్యయన బాధ్యతలు ముంబై ఐఐటీ ప్రొఫెసర్లకు అప్పగించారు. వారు కూడా ప్రస్తుతం అక్కడి పరిస్థితి..? పర్యావరణంపై ప్రభావం పడుతుందా..? అదనపు చర్యలు చేపట్టాలా..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు..? తదితర అంశాలపై నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే ఒకసారి డంపింగ్‌ యార్డును ప్రొఫెసర్లు పరిశీలించి వెళ్లారు. సీపీసీబీ పరిశీలన నేపథ్యంలో ప్రొఫెసర్ల నివేదికను కూడా ప్రామాణికంగా తీసుకోవచ్చని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-11-18T12:40:51+05:30 IST