Bharat Bandh.. అప్రమత్తమైన పోలీసులు
ABN , First Publish Date - 2022-06-20T16:56:57+05:30 IST
అగ్నిపథ్ (Agneepath) పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Internet Desk: అగ్నిపథ్ (Agneepath) పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు నిరసన బృందాలు సోమవారం (Monday) భారత్ బంద్ (Bharat Bandh)కు పిలుపు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ (AP), తెలంగాణ (Telangana)తోపాటు హరియాణ, జార్ఖండ్, పంజాబ్, కేరళ రాష్ట్రాలు అప్రమత్తమై భద్రత ఏర్పాట్లను పెంచాయి. హరియాణలోని ఫరిదాబాద్లో భారీగా పోలీసులు మోహనించారు. వివిధ ప్రాంతాల్లో 2వేల మందికిపైగా పోలీసులు పహరా కాస్తున్నారు. జార్ఖండ్లో సోమవారం పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
భారత్ బంద్కు సోమవారం నిరసనకారులు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. ఉదయం 5 గంటల నుంచే విజయవాడలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో పోలీస్ బలగాలు మోహరించాయి. భారత్ బంద్ పేరిట హింసాత్మక ఘటనలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో తిరుపతిలోనూ పోలీసు బలగాలు మోహరించాయి. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా తిరుపతిలోని వివిధ ప్రాంతాలలో 5 వందల మంది పోలీసులు మోహరించారు. తిరుపతికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
కాగా ఈ నెల 17న జరిగిన ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ప్రజాసంఘాలు, అభ్యర్థులు ఎవరూ రైల్వే స్టేషన్ వద్దకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రయాణీకులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వారిని లోపలికి అనుమతిస్తున్నారు.