Good News : జూన్లో మరో రెండు ఫ్లై ఓవర్లు..
ABN , First Publish Date - 2022-05-31T11:47:18+05:30 IST
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు..
- అందుబాటులోకి ఖైతలాపూర్, చాంద్రాయణగుట్ట
హైదరాబాద్ సిటీ : నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు ఎస్ఆర్డీపీ (స్ట్రాటజిక్ రోడ్ డెవల్పమెంట్ ప్రాజెక్ట్)లో భాగంగా మొదటి దశలో చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఖైతలాపూర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని జూన్లో ప్రారంభించే అవకాశముందని అధికారులు తెలిపారు. చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ (Flyover) కూడా అదే నెలలో అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు. ప్రతిపాదిత పనులను ఈ సంవత్సరం డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకంలో ఇప్పటి వరకు చేపట్టిన 41 పనుల్లో 29 అందుబాటులోకి వచ్చాయి.
ఆర్ఓబీ ప్రారంభంతో..
కూకట్పల్లి, హైటెక్ సిటీ మధ్యలో ఖైతలాపూర్ ఆర్ఓబీ ప్రారంభంతో జేఎన్టీయూ, మలేసియా టౌన్షిప్, సైబర్ టవర్స్ జంక్షన్ మధ్య ట్రాఫిక్ తగ్గనుంది. సనత్నగర్, బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వరకు వెళ్లేందుకు 3.50 కిలో మీటర్ల దూరం తగ్గనుంది. ఖైతలాపూర్తో కలిసి మొత్తం ఏడు ఆర్ఓబీ/ ఆర్యూబీలు అందుబాటులోకి వచ్చాయి. ఉత్తమ్నగర్, లాలాపేట్, తుకారాం గేట్, ఉప్పుగూడ లెవెల్ క్రాసింగ్, హైటెక్సిటీ, ఆనంద్బాగ్ ప్రాంతాల్లో ఇప్పటికే మెరుగైన రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.