ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారంలో మధ్యవర్తి నందకుమార్పై మరో కేసు
ABN , First Publish Date - 2022-11-17T03:21:12+05:30 IST
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నందకుమార్ అలియాస్ నందుపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో మరో కేసు నమోదైంది.
బంజారాహిల్స్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నందకుమార్ అలియాస్ నందుపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఫిలింనగర్లోని సినీ నటుడు రానాకు చెందిన ప్లాట్లో నందకుమార్ అక్రమ నిర్మాణాలు చేపట్టాడు. ఈ స్థలంపై చట్టపరంగా అతడికి ఎలాంటి హక్కులు లేకపోవడంతో జీహెచ్ఎంసీ కూల్చివేసింది. ఇదిలా ఉండగా, ఈ ప్లాట్లో నందు కొంత స్థలాన్ని సంజయ్రెడ్డి అనే వ్యక్తికి ఐస్క్రీం పార్లర్ కోసం లీజుకు ఇచ్చేందుకు రూ.8లక్షలు అడ్వాన్స్గా తీసుకున్నాడు. ఆ తర్వాత సంజయ్రెడ్డి రూ.40 లక్షలతో ఇంటీరియర్ డిజైనింగ్ కోసం ఖర్చు చేశాడు. ఇదే ప్లాట్లో స్థలాన్ని బరిస్టా కేఫ్, బాంబే గార్మెంట్ స్టోర్లకు కూడా నందకుమార్ లీజుకు ఇచ్చి లక్షలాది రూపాయలు తీసుకున్నాడు. నందు మోసాన్ని గ్రహించిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.