భాగ్యనగరానికి ఉత్తరాన అభివృద్ధి.. Ask Me KTRలో మంత్రి..
ABN , First Publish Date - 2022-01-14T17:43:08+05:30 IST
భాగ్యనగరానికి ఉత్తరాన అభివృద్ధి.. Ask Me KTRలో మంత్రి..

హైదరాబాద్ సిటీ : హైదరాబాద్కు ఉత్తరాన ఉన్న సుచిత్ర జంక్షన్ వద్ద వంతెన నిర్మాణం చేపట్టనున్నట్టు పురపాలకశాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ‘ఆస్క్ కేటీఆర్’ ట్విటర్ ద్వారా ఆయన నెటిజన్లకు అందుబాటులోకి వచ్చారు. నగరం ఉత్తరాన అభివృద్ధి ప్రణాళికలున్నాయా.. వంతెనలు నిర్మిస్తారా ? అన్న ఓ నెటిజన్ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన చెరువులను పట్టించుకోవడం లేదని, లంగర్హౌస్ చెరువు చెత్త కుప్పలా మారిందని ఓ పౌరుడు పేర్కొన్నారు. తగిన చర్యలు తీసుకోవాలని మేయర్ విజయలక్ష్మికి సూచించారు.
ఆర్కే పురం అండర్పాస్ వద్ద అక్రమంగా నిర్మించిన గోడ కూల్చివేయడంలో ఇబ్బందులేమిటన్న ప్రశ్నకు ఓసారి పరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు సూచించారు. హస్తినాపురంలో వీధి దీపాలు వెలగడం లేదని, సాయంత్రం 6.30 తర్వాత ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ప్రశ్నించగా తగిన చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్కు మంత్రి సూచించారు. బహదూర్పురా వంతెన నిర్మాణం రెండు, మూడు నెలల్లో పూర్తవుతుందన్నారు. అల్లాపూర్ రోడ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్తను సంబంధిత అధికారులతో మాట్లాడి తొలగించేలా చూడాలని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్కు మంత్రి సూచించారు.