‘నాన్-రెవెన్యూ’లకు ఐఏఎస్ పదోన్నతులపై సందిగ్ధత
ABN , First Publish Date - 2022-12-31T04:41:30+05:30 IST
రాష్ట్రంలోని నాన్-రెవెన్యూ అధికారులకు ఐఏఎ్సలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ఇంటర్వ్యూలు నిర్వహించకపోవడం..
నేటితో ముగియనున్న సెలెక్ట్ లిస్ట్-21 గడువు
ఇంటర్వ్యూలు నిర్వహించని సెలెక్షన్ కమిటీ
జాబితాలోని అధికారుల్లో ఆందోళన
హైదరాబాద్, డిసెంబరు30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నాన్-రెవెన్యూ అధికారులకు ఐఏఎ్సలుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ఇంటర్వ్యూలు నిర్వహించకపోవడం, ‘యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్(ఏసీఆర్)’ పరిశీలన తేదీలను ప్రకటించకపోవడంతో అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఎనిమిదేళ్ల విరామనంతరం పదోన్నతులు కల్పిస్తున్నారని, ఇందులోనూ జాప్యం చోటు చేసుకుంటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘సెలక్ట్ లిస్ట్-2021’ గడువు ఈ నెల 31తో ముగియనుండగా.. ఇప్పటివరకు రాష్ట్రానికి సంబంధించిన యూపీఎ్ససీ ‘సెలక్షన్ కమిటీ’ సమావేశం జరగకపోవడం గమనార్హం.
ఎంపిక ఎలా..?
‘నాన్-స్టేట్ సివిల్ సర్వీ్స(నాన్-ఎ్ససీఎ్స)’ కోటా కింద ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు ఐఏఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కో పోస్టుకు ఐదుగురు చొప్పున మొత్తం 25మందిని ఎంపిక చేసి, కేంద్ర సిబ్బంది- శిక్షణ శాఖ(డీఓపీటీ)కు గత ఏడాది రాష్ట్రం పంపించింది. యూపీఎ్ససీ ఆధ్వర్యంలోని ‘సెలక్షన్ కమిటీ’ సమావేశమై అధికారుల ఏసీఆర్లను పరిశీలించి, ఇంటర్వ్యూలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ..రాష్ట్రానికి సంబంధించిన సెలక్షన్ కమిటీ సమావేశం జరగలేదు. సెలెక్ట్ లిస్ట్-21 గడువును శనివారం ముగియనున్న నేపథ్యంలో.. ఆలోపుగా ఏసీఆర్లను పరిశీలించినా... ఇంటర్వ్యూలను జనవరిలో నిర్వహించుకునే వీలుంటుంది. కేరళ ప్రమోషన్లకు సంబంధించి ఈ నెల 28, 29 తేదీల్లో ఇంటర్వ్యూలు అయిపోయాయి. బిహార్ అధికారులకు శుక్రవారం ఏసీఆర్ల పరిశీలన జరిగింది. వీరికి వచ్చే 18, 19 తేదీల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. కానీ... యూపీఎస్సీ వెబ్సైట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. గురువారంలోపు ఏసీఆర్ల పరిశీలన, ఇంటర్వ్యూలు జరగకపోతే ఈ ఏడాది జాబితా... వచ్చే ఏడాది జాబితాలో విలీనమవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.