తెలుగు రాష్ట్రాల కళాకారులకు.. సంగీత నాటక అకాడమీ అవార్డులు
ABN , First Publish Date - 2022-11-26T03:52:30+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఎంపికయ్యారు. 2019, 2020,
జాబితాను ప్రకటించిన కేంద్ర సాంస్కృతిక శాఖ
న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు కళాకారులు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగీత నాటక అకాడమీ అవార్డులకు ఎంపికయ్యారు. 2019, 2020, 2021 సంవత్సరాలకుగాను అవార్డుకు ఎంపికైన వారి జాబితాను శుక్రవారం కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన సంగీత విభాగంలో హరికథ కళాకారిణి ఉమా మహేశ్వరి, కర్ణాటక గాయకుడు బాలకృష్ణ ప్రసాద్, మృదంగ కళాకారుడు పత్రి సతీశ్ కుమార్, నృత్య విభాగంలో కూచిపూడికిగానూ మంజు భార్గవి, పసుమర్తి విఠల్-భారతి విఠల్ (సంయుక్తంగా), ఎన్ శైలజ.. థియేటర్ విభాగంలో సురభి నాటక దర్శకుడు ఆర్ వేణుగోపాల్ రావుకు ఈ పురస్కారం లభించింది. పురస్కారంలో భాగంగా తామ్రపత్రంతో పాటు రూ.3 లక్షలు అందిస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది. మరోవైపు, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన కూచిపూడి నృత్యకారుడు వసంత్ కిరణ్కు, పేరిణి నృత్యకారుడు ధరావత్ రాజ్ కుమార్, మాండోలిన్ కళాకారిణి ఉప్పలపు నాగమణి ఎంపికయ్యారు.
‘అమృత్’ అవార్డుకు ఆరుగురి ఎంపిక
ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ఇస్తున్న సంగీత నాటక అకాడమీ అమృత్ అవార్డుకు దేశవ్యాప్తంగా 75 మంది కళాకారులను ఎంపిక చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కు చెందిన పండితారధ్యుల సత్యనారాయణ(హరికథ), మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తి(కూచిపూడి), మహాభాష్యం చిత్తరంజన్(సుగమ్ సంగీత్), తెలంగాణకు చెందిన బాసిని మేరెడ్డి(థియేటర్), కొలంక లక్ష్మణ్రావు(మృదంగం), ఒగ్గరి ఐలయ్య(ఒగ్గుకథ) ఉన్నారు. పురస్కారంలో భాగంగా తామ్రపత్రంతో పాటు రూ.లక్ష అందిస్తామని కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది.