TRS-BJP నేతల మధ్య మళ్లీ లొల్లి.. భారీగా పోలీసుల మోహరింపు.. పొలిటికల్ హీట్..
ABN , First Publish Date - 2022-01-06T14:32:12+05:30 IST
TRS-BJP నేతల మధ్య మళ్లీ లొల్లి.. భారీగా పోలీసుల మోహరింపు.. పొలిటికల్ హీట్..
- రాజకీయ శిలా ఫలకం
- 20 ఫీడ్ల రోడ్డు మరమ్మతు పనులపై లొల్లి
హైదరాబాద్ సిటీ/బోయినపల్లి : అది 20 ఫీట్ల రోడ్డు. జరుగుతున్నవి మరమ్మతు పనులు మాత్రమే. ఆ పనులను ప్రారంభించే హక్కు మాదంటే మాదంటూ.. టీఆర్ఎస్, బీజేపీ నేతలు లొల్లి చేస్తున్నారు. గత ఆదివారం దీనిపై పెద్ద యుద్ధమే జరిగి శంకుస్థాపన ఆగిపోయింది. బుధవారం మళ్లీ రగడ ప్రారంభమైంది. శిలా ఫలకాన్ని వేరే చోటుకు మార్చి.. స్థానిక ఎమ్మెల్యే రాకుండానే కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ శంకుస్థాపన చేయడం వివాదాస్పదంగా మారింది.
- ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు కానీ, కనీసం బోర్డు సీఈవోకు కానీ సమాచారం ఇవ్వకుండా కంసారిబజార్ రోడ్ మరమ్మతు పనులకు గత ఆదివారం శంకుస్థాపన చేసేందుకు రామకృష్ణ, బీజేపీ 6వ వార్డు సభ్యుడు భానుక మల్లికార్జున్ ప్రయత్నించారు.
టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి దాన్ని అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పనుల ప్రారంభోత్సవం ఆగిపోయింది. సీఈవో అనుమతి ఇవ్వడంతో ఆదివారం చాయ్ అడ్డా వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అక్కడి నుంచి కొద్దిదూరంలో ఉన్న మిలటరీ గోడ వద్ద ఏర్పాటు చేసి రామకృష్ణ బుధవారం పనుల ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ నాయకులు అక్కడికి వచ్చేలోపే తతంగం ముగించారు. దీనిపై అసహనం వ్యక్తం చేసి సాయన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అలజడులు రేపుతున్నారు..
జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి సాయన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేను అయిన తనకు సమాచారం ఇవ్వకుండా మరమ్మతు పనులకు ప్రారంభో త్సవం కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యుడైన రామకృష్ణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా వ్యవ హరిస్తూ ప్రశాంతంగా ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం లో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేకు, అధికారులకు సమాచారం ఇవ్వకపోవడం సరికాదన్నారు. బీజేపీ నాయకులు ప్రొటోకాల్ పాటించకపోతే, తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పున రావృతమైతే ఊర్కోమని జక్కుల మహేశ్వర్రెడ్డి హెచ్చరించారు. తొలుత రామకృష్ణ మాట్లాడుతూ కంటోన్మెంట్ నిధులతో చేపట్టే పనులకు ఎమ్మెల్యే, అధికారుల ప్రమేయం అవసరం లేదని అన్నారు.