నెరవేరిన 40 ఏళ్ల కల.. త్వరలో ప్రారంభం
ABN , First Publish Date - 2022-03-02T18:52:41+05:30 IST
నలభై ఏళ్ల కల నెరవేరడంతో అడ్డగుట్ట, తుకారాంగేట్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం
హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : నలభై ఏళ్ల కల నెరవేరడంతో అడ్డగుట్ట, తుకారాంగేట్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం లాలాగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆర్యూబీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైల్వే అధికారులను ఒప్పించి నిధులు రప్పించి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ. 29 కోట్లతో తుకారాంగేట్లో వంతెన నిర్మాణానికి నాంది పలికారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో రెండు మూడు రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడల్లా ఆర్యూబీ నిర్మిస్తామని చెప్పేవారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడంతో ప్రజలు, వ్యాపారులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు.
ఈసీఐఎల్కు తగ్గనున్న దూరం
లాలాగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆర్యూబీ లేనప్పుడు సికింద్రాబాద్ నుంచి ఈసీఐఎల్, కుషాయిగూడ, హనుమాన్పేట్, మల్కాజిగిరి, సఫిల్గూడ, లాలాగూడ, శాంతినగర్, ఏఎ్సరావునగర్, మౌలాలి వెళ్లాలంటే సికింద్రాబాద్ నుంచి మెట్టుగూడ మీదుగా వెళ్లాల్సి వచ్చేది. ఐదు కిలోమీటర్ల దూరం ఎక్కువగా ప్రయాణం చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆర్యూబీ నిర్మాణం వల్ల మూడు కిలోమీటర్ల దూరం తగ్గడంతో వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈసీఐఎల్కు సికింద్రాబాద్ సంగీత్ నుంచి తుకారాంగేట్ మీదుగా వెళ్లితే షార్ట్కట్ అవుతుంది.
లాలాగూడ రైల్వేస్టేషన్కు వెళ్లేందుకు..
తుకారాంగేట్, అడ్డగుట్ట, ఈస్ట్మారేడ్పల్లి, హనుమాన్పేట్, మహీంద్రాహిల్స్ ప్రాంతవాసులు లాలాగూడ రైల్వే స్టేషనకు వెళ్లేందుకు ఆర్యూబీ రెండు వైపులా మార్గం ఏర్పాటు చేశారు.
పద్మారావుకు అభినందనలు
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు అడ్డగుట్ట, తుకారాంగేట్లోని మహిళా సంఘాల నాయకులు అభినందనలు తెలిపారు.