వారంలో 3 రోజులు నియోజకవర్గాల్లోనే!

ABN , First Publish Date - 2022-11-08T05:50:19+05:30 IST

మునుగోడులో బీజేపీ నుంచి గట్టి సవాల్‌ ఎదురైన నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లోనే

వారంలో 3 రోజులు నియోజకవర్గాల్లోనే!

ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలు

వామపక్షాలతో సఖ్యతగా ఉండాలని సూచన

నాగర్‌కర్నూలు, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): మునుగోడులో బీజేపీ నుంచి గట్టి సవాల్‌ ఎదురైన నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. వారంలో మూడు రోజుల పాటు నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండేలా కార్యాచరణను రూపొందించుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు తెలిసింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌కు కూడా పదును పెట్టాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు నెల రోజుల పాటు మునుగోడులో మకాం వేసి, అహోరాత్రులు శ్రమించినా.. క్షేత్రస్థాయిలో బీజేపీ పునాదులు పటిష్ఠం కావడం ఆషామాషీ వ్యవహారం కాదనే భావనలో అధికార పార్టీ ఉంది. శాసనసభకు మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఇంటిని చక్కదిద్దుకోవాలని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చేసిన పనులకు డబ్బులు రాకపోవడం, కష్టపడి పని చేసినా పదవులు దక్కలేదనే అసంతృప్తితో ఉన్న టీఆర్‌ఎస్‌ ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలని అధినేత కేసీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం. వామపక్షాల ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో.. ఆయా పార్టీల నేతలతో సఖ్యతగా మెలగాలని, ఇతర పార్టీల నాయకులను ఆకర్షించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని సూచించినట్లు తెలిసింది. నియోజవకర్గాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయాలని ఆదేశాలు అందాయి. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల భవనాలను పూర్తి చేయడంతోపాటు టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని చేపట్టాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం యోచిస్తోంది.

Updated Date - 2022-11-08T05:50:20+05:30 IST