ప్రజాసంగ్రామ పాదయాత్రలో దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి
ABN , First Publish Date - 2022-08-16T05:30:00+05:30 IST
బండిసంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రపై దాడిచేసిన టీఆర్ఎస్ శ్రేణులను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి డిమాండ్ చేశారు.
నిర్మల్ టౌన్, ఆగస్టు 16 : బండిసంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్రపై దాడిచేసిన టీఆర్ఎస్ శ్రేణులను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు పడకంటి రమాదేవి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టబొమ్మను బీజేవైఎం ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జనగామ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపట్టిన మూడోవిడత ప్రజా సంగ్రామ పాద యాత్రలో టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు. శాంతిభద్రతలను కాపాడవలసిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్ తరహాలో రాష్ట్రం లో విపక్షపార్టీలపై దాడులకు పాల్పడడం సరికాదని, కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఎన్ని దాడులు చేసినా పాదయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మె రాజు, సామ రాజేశ్వర్రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఒడిసెల అర్జున్, రాష్ట్ర నాయకులు అయ్యన్న గారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షురాలు వడ్లకొండ అలివేలు, కొండాజి శ్రావణ్, అల్లం భాస్కర్, పొలాస భరత్, శివానంద, తదితరులు పాల్గొ న్నారు.