పత్తిలో ‘అధిక సాంద్ర పద్ధతి’ మేలు
ABN , First Publish Date - 2022-06-23T04:19:09+05:30 IST
రైతులు పత్తి పంటను అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తే పంట దిగుబడి పెరుగుతుందని మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు అనిత అన్నారు.
- మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు అనిత
హాజీపూర్, జూన్ 22: రైతులు పత్తి పంటను అధిక సాంద్ర పద్ధతిలో సాగు చేస్తే పంట దిగుబడి పెరుగుతుందని మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు అనిత అన్నారు. మండలంలోని ర్యాలీ గ్రామంలో బుధవారం రైతులకు అధిక సాంద్ర పద్ధతి సాగుపై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ పత్తి పంటను అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేస్తే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంట దిగుబడి సాధించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఎకరా విస్తీర్ణంలో 3 నుంచి 4వేల విత్తనాలు మాత్రమే విత్తుతున్నామని చెప్పారు.ఇదే అధిక సాంద్ర పద్ధతిలో అయితే ఎకరాకు 25 వేల నుంచి 30 వేల వరకు విత్తనాలను విత్తుకునే అవకాశం ఉంటుందన్నారు. పంట 150 రోజుల్లో చేతికి వస్తుందన్నారు. ఈ పద్ధతి వల్ల గులాబీరంగు పురుగు ఉధృతి తగ్గుతుందన్నారు. రైతులు రెండో పంట వేసుకునేందుకు కూడా వీలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే బెల్లంపల్లి శాస్త్రవేత్త తిరుపతి, మండల వ్యవసాయాధికారి రజిత, ఏఈవో మౌనిక, గ్రామ సర్పంచు రాజు, ఉపసర్పంచు భూమయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లస్మయ్య, ఎంపీటీసీ కోట్నాక జంగు, రైతులు పాల్గొన్నారు.