విద్యార్థులు సైన్స్ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి : డీఈవో
ABN , First Publish Date - 2022-03-18T05:58:10+05:30 IST
పెరుగుతున్న ఆధునిక యుగంలో సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకోవాలని డీఈవో ప్రణిత అన్నారు.
ఆదిలాబాద్టౌన్,మార్చి17: పెరుగుతున్న ఆధునిక యుగంలో సైన్స్ ప్రాముఖ్యతను విద్యార్థులు తెలుసుకోవాలని డీఈవో ప్రణిత అన్నారు. 49వ జవహార్లాల్ నెహ్రూ జాతీయ సైన్స్, గణిత, పర్యావరణలో భాగంగా గురువారం వర్చువల్ పద్ధతిలో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. స్థానిక లిటిల్ స్టార్ పాఠశాలలో నిర్వహించిన ఇందులో జిల్లాలోని విద్యార్థులు వారి ప్రదర్శనలను ప్రదర్శించారు. తయారీ విధానం, పని తీరు వాటిని వివరించారు. అంతకుముందు డీఈవోను విద్యార్థులు బ్యాండ్ మేళాతో స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రదర్శన లోగోను ఆవిష్కరించి వర్చువల్ ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, పాఠశాల ప్రిన్సిపాల్ కమలాకర్రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయికి విద్యార్థుల ఎంపిక
49వ జవహర్లాల్ నెహ్రూ జాతీయ గణిత సైన్స్, పర్యావరణ ప్రదర్శన 2022 కార్యక్రమాన్ని వర్చువల్ ఆన్లైన్ పద్ధతిలో పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా, రాష్ట్ర స్థాయికి విద్యార్థులను ఎంపిక చేసినట్లు డీఈవో ప్రణీత పేర్కొన్నారు. సాంకేతిక, బొమ్మలు అనే ప్రధాన అంశంగా ఏడు అంశాలలో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన ఫలితాలను ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈకో ప్రెండ్లీ మెటేరియల్ అనే ఉప అంశంలో జైనథ్ టీఎస్ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న వంశీ మొదటి స్థానంలో, రెండో స్థానంలో జడ్పీహెచ్ఎస్ చాందకు చెందిన విఘ్నేష్, మూడోవ స్థానంలో జడ్పీహెచ్ఎస్ జైనథ్కు చెందిన హారిప్రియ, నాలుగో స్థానంలో తలమడుగు ఖోడద్ జడ్పీహెచ్ఎస్కు చెందిన అశోక్, టీడబ్ల్యూఆర్ఎస్ బోథ్కు చెందిన ఎస్ కావ్య 5వ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. ఆయా విభాగాల్లో నిర్వహించిన దానిలో హెల్త్ అండ్ క్లీన్లైనెస్ విభాగంలో జడ్పీహెచ్ఎస్ కూరకు చెందిన బి.సాక్షి మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.