ప్రబలుతున్న డయేరియా

ABN , First Publish Date - 2022-07-08T05:14:23+05:30 IST

ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో డయేరియా ప్రబలుతోంది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో బావుల్లో కొత్తనీరు చేరడంతో అవి తాగుతున్న ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు.

ప్రబలుతున్న డయేరియా


ఉట్నూర్‌, జూలై 6: ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో డయేరియా ప్రబలుతోంది. కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో బావుల్లో కొత్తనీరు చేరడంతో అవి తాగుతున్న ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. ఏజెన్సీలోని వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు ఇంటింటికీ తిరుగుతూ గ్రామీణులను చైతన్య వంతులను చేస్తున్నప్పటికీ కాచి చల్లార్చిన నీటిని తాగడంలో ప్రజలు శ్రద్ధ చూపక పోవడంతో డయేరియా బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఉట్నూర్‌ మండలం నాగాపూర్‌లో గురువారం జాదవ్‌ పరశురాంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నీల, నవనీతలు సైతం వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో గ్రామస్థులు హుటాహుటిన ముగ్గురిని ఉట్నూర్‌ ఆస్పత్రికి  తరలించి వైద్యం అందేలా చొరవ చూయించారు. ఉట్నూర్‌ ఆస్పత్రిలో కుమ్రం భీం జిల్లా  జైనూర్‌ మండలం ఆశపల్లికి చెందిన జీజాబాయి, ఉట్నూర్‌ ఎన్టీఆర్‌కాలనీకి చెందిన కళావతి, ఓంప్రకాష్‌, నార్నూర్‌ మండలం జామడకు చెందిన మారు డయేరియాతో బాధపడుతూ ఉట్నూర్‌ ఆస్పత్రిలో వైద్యం అందుకుంటున్నారు. ఏజెన్సీలోని దంతన్‌పల్లి, శ్యాంపూర్‌, హస్నాపూర్‌, ఇంద్రవెల్లి, పిట్టబొంగరం, నార్నూర్‌, ఝరి, గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ర్యాఫిడ్‌ ఫీవర్‌ సర్వే నిర్వహిస్తూ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ వ్యాధులు ప్రబలుతున్నాయి. కొన్ని రోజులుగా ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వేలో భాగంగా 21 వైద్య శిబిరాలు నిర్వహించి 1057 మందికి వైద్య సేవలు అందించినట్లు డీడీఎంహెచ్‌వో విజయ్‌కుమార్‌ తెలిపారు. అందులో 38 మంది జ్వర బాధితులు కాగా 11 మంది డయేరియా బాధితులకు వైద్య సేవలు అందించామని తెలిపారు. 

Updated Date - 2022-07-08T05:14:23+05:30 IST