రక్తలేమితో కొలాం గిరిజన మహిళ మృతి
ABN , First Publish Date - 2022-03-05T07:04:33+05:30 IST
ఉట్నూర్ మండలంలోని సాలేగూడకు చెందిన కొలాం గిరిజన మహిళ ఆత్రం జంగుబాయి(25) శుక్రవారం ఉదయం రక్తలేమితో బాధపడుతూ మృతి చెందింది. జంగుబాయి భర్త ఆత్రం అర్జున్ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం తన భార్య జంగుబాయికి జ్వరం రావడంతో పాటు వాంతులు
ఉట్నూర్, మార్చి 22: ఉట్నూర్ మండలంలోని సాలేగూడకు చెందిన కొలాం గిరిజన మహిళ ఆత్రం జంగుబాయి(25) శుక్రవారం ఉదయం రక్తలేమితో బాధపడుతూ మృతి చెందింది. జంగుబాయి భర్త ఆత్రం అర్జున్ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం తన భార్య జంగుబాయికి జ్వరం రావడంతో పాటు వాంతులు చేసుకుందని వెంటనే శ్యాంపూర్ ప్రాథమిక ఆస్పతికి తరలించగా వాంతులు తగ్గాయని తెలిపారు. ఇంటికి తెచ్చి జ్వరం తగ్గుతుందని భావించినప్పటికీ.. రక్తలేమి ఉండడంతో శుక్రవారం ఉదయం తీవ్రంగా ఆరోగ్యం క్షీణించడంతో ముత్నూర్లోని 108 అంబులెన్స్కు సమాచారం అందించగా.. సాలేగూడ ఉట్నూర్ మండలంలో ఉందని, ఉట్నూర్ అంబులెన్స్కు ఫోన్ చేయాలని చెప్పారన్నారు. ఉట్నూర్ 108 అంబులెన్స్ నిర్వాహకులకు ఫోన్ చేస్తే సరిగ్గా స్పందించలేదని, తామే ఆటోలో తెస్తున్నామని, మధ్యలో 108 లోకి తీసుకుని వెళ్లాలని సూచించారు. అయితే, ఉట్నూర్ ఆస్పత్రి వరకు తెచ్చిన కూడా అంబులెన్స్ రాలేదని, ఆస్పత్రికి వచ్చే సరికి తన భార్య చనిపోయిందని అర్జున్ వాపోయారు. సకాలంలో అంబులెన్స్ నిర్వాహకులు స్పందిస్తే వైద్యం అందేదని, అంబులెన్స్ నిర్వాహకుల కారణంగానే తన భార్య చనిపోయిందని ఆరో పించారు. మృతురాలికి 18 నెలల కుమారుడు రోహిత్ ఉన్నాడు. మొదటి కాన్పులోనే రోహిత్ పుట్టినప్పటి నుంచి రక్తలేమితో బాధపడుతున్న తన భార్యకు వైద్య సిబ్బంది సరైన వైద్యం అందించలేదని అన్నారు. కొలాం గిరిజన మహిళ రక్తలేమితో మృతి చెందినందున ఆమె కుటుంబానికి జిల్లా అధికారులు ఐటీడీఏ ద్వారా తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కొలాం సేవాసంఘం నాయకులు ముకుంద్రావు, మానిక్రావులు డిమాం డ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బంది, అంబులెన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.