ఉపాధిహామీ పనులు పకడ్బందీగా చేపట్టాలి
ABN , First Publish Date - 2022-03-17T04:31:28+05:30 IST
ఉపాధిహామీ, పారిశుధ్య నిర్వహణ పనులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదికలో బుధవారం బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్ మండలాల పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
- కలెక్టర్ భారతి హోళికేరి
బెల్లంపల్లి, మార్చి 16: ఉపాధిహామీ, పారిశుధ్య నిర్వహణ పనులు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని రైతు వేదికలో బుధవారం బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్ మండలాల పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో చేపడుతున్న పనుల్లో వేగం పెంచి కూలీలకు పనులను కల్పించాలన్నారు. ఏపీవోలు అందుబాటులో ఉంటూ పనులను పర్యవేక్షించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రగతి నివేదికలను పంపాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పంచాయతీ సిబ్బంది చేత పారిశుధ్య పనులను పూర్తిస్ధాయిలో చేయించాలన్నారు. నర్సరీలకు నెట్షెడ్లు, నీటి సౌకర్యం కల్పిస్తూ వేసవిలో మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.. అధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వ యంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. గ్రామ పంచాయ తీల్లో వంద శాతం పన్నులను వసూలు చేయాలని, వైకుంఠధామాలు, కంపోస్టుషెడ్లను వినియోగించాలని తెలిపారు. సమావేశంలో డీఆర్డీవో శేషాద్రి, డీపీవో నారాయణరావు, డీఎల్పీవో ఫణీందర్రావు, బెల్లంపల్లి మండల ప్రత్యేకాధికారి దుర్గా ప్రసాద్, బెల్లంపల్లి, తాండూర్ , కాసిపేట మండలాల టీఏలు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.