నిర్మల్ సర్కారు దవాఖానాలో అరుదైన ఆపరేషన్
ABN , First Publish Date - 2022-07-03T06:05:06+05:30 IST
నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ చేసి కొత్త రికార్డు నమోదు చేశారు.
తొలిసారిగా మోకాలి చిప్ప మార్చిన వైద్యులు
అభినందించిన జిల్లా కలెక్టర్
నిర్మల్ అర్బన్, జూలై 2 : నిర్మల్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ చేసి కొత్త రికార్డు నమోదు చేశారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటైన తరువాత అప్గ్రేడ్ అయిన ఆసుపత్రిలో తొలిసారిగా మోకాలి చిప్ప ఆపరేషన్ సమర్ధవంతంగా నిర్వహించి కొత్త చిప్ప అమర్చిన వైద్యులు రోగానిన సాధారణంగా నడిచేలా చేశారు. జిల్లాలోని మామడ మండలం రాయదారి గ్రామానికి చెందిన దేవాసింగ్ కొన్నాళ్ళుగా మోకాలు నొప్పితో భాధపడుతున్నాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితుల్లో నిర్మల్ ఆసుపత్రిలో చేరాడు. రోగిని పరిశీలించిన వైద్యులు మోకాలు చిప్పకు ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. ఈ మేరకు అర్థోపేడిక్ వైద్యులు డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి , రఘునంధన్ రెడ్డి , విజయ్ రెడ్డిలు మోకాలు చిప్ప ఆపరేషన్ చేశారు. అనస్థిషియా నళిని , వేణు సహాకరించారు. ప్రస్తుతం కోరుకుంటున్న రోగి దేవాసింగ్ స్వయంగా నొప్పి లేకుండా నడవగలుగుతున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ జిల్లాలో తొలిసారిగా ప్రభుత్వ దవాఖానాలో మోకాలు చిప్ప ఆపరేషన్ నిర్వహించడం గొప్ప విషయమని అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు , సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ జిల్లా దవాఖానాకు మంచి పేరు తెస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వం తరపున మరింత సహకారం అందిస్తామన్నారు. జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ దేవేంధర్ రెడద్డి మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు , జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీల సహకారంతో దవాఖానాలో గణనీయంగా వైద్య సేవలు అందించగలుగుతున్నామని చెప్పారు. భవిష్యత్లో మరిన్ని అరుదైన ఆపరేషన్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఖరీదైన వైద్యాన్ని స్థానికంగానే అందించి ఆరోగ్య శ్రీ పథకం ద్వారా మోకాలు చిప్ప ఆపరేషన్ చేసి కొత్త జీవితం ప్రసాదించిన ప్రభుత్వ వైద్యులకు రోగి దేవాసింగ్ కృతజ్ఙతలు తెలిపారు.