కోతిని మింగిన కొండచిలువ
ABN , First Publish Date - 2022-10-16T03:40:07+05:30 IST
మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులోని గోదావరి తీరంలో గల పంటపోలాల వద్ద శనివారం కొండచిలువ కోతిని మింగేసినట్లు రైతులు తెలిపారు.
దండేపల్లి, అక్టోబరు 15: మండలంలోని కొండాపూర్ గ్రామ శివారులోని గోదావరి తీరంలో గల పంటపోలాల వద్ద శనివారం కొండచిలువ కోతిని మింగేసినట్లు రైతులు తెలిపారు. పొలాలకు వెళ్లిన రైతులకు ఓ చెట్టు వద్ద కోతుల మంద అరుపులు చేస్తూ కనిపించింది. దీంతో రైతులు వాటిని చెదరగొట్టే క్రమంలో అక్కడికి వెళ్లిన పలువురు రైతులకు కోతిని మింగితున్న కొండ చిలువ కనిపించింది. దీంతో రైతులు స్థానికులకు సమాచారం అందించడంతో పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. పెద్ద కోతిని మింగడంతో ఊపిరాడక కొండచిలువ అక్కడే మృతి చెందిందని స్థానికులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు పైనుంచి వచ్చిన వరదలో కొండచిలువ కొట్టుకు వచ్చి ఉంటుందని రైతులు చెబుతున్నారు.