T20 World Cup 2022: కల చెదిరింది

ABN , First Publish Date - 2022-11-11T03:12:24+05:30 IST

ఎప్పుడో 2007లో తొలి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచాం. అప్పటినుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా టీమిండియా

T20 World Cup 2022: కల చెదిరింది

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఎప్పుడో 2007లో తొలి టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచాం. అప్పటినుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా టీమిండియా మళ్లీ ఆ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. ఇక, ఈసారి సెమీఫైనల్‌ చేరినా, కీలక మ్యాచ్‌లో తడబాటుకు గురైంది. ఇంగ్లండ్‌తో సెమీ్‌సలో మూకుమ్మడి బౌలింగ్‌ వైఫల్యంతో ఫైనల్‌ చేరకుండానే వెనుదిరిగింది. అందుకు గల కారణాలను విశ్లేషిస్తే...

ఏదీ ‘పవర్‌’?: టీమిండియా టాపార్డర్‌ బ్యాటర్ల సత్తా మరోసారి చర్చనీయాంశమైంది. రాహుల్‌ టోర్నీలోని ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో తీవ్రంగా నిరాశ పరిచాడు. ఇక ఈ ఆరు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌ రోహిత్‌ ఒక హాఫ్‌ సెంచరీతో సరిపెట్టాడు. ఇక, కీలకమైన సెమీఫైనల్లో వీరిద్దరూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో భారత్‌ పవర్‌ప్లేలో ఎక్కువ స్కోరు చేయలేకపోయింది.

ప్చ్‌..పేస్‌ బౌలింగ్‌: గాయంతో ప్రపంచ కప్‌నకు బుమ్రా దూరమైన నేపథ్యంలో అతడి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్న తలెత్తింది. నిలకడగా గంటకు 150 కి.మీ.ల వేగంతో బౌలింగ్‌ చేయగల ఏకైక భారత పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను కొందరు బుమ్రాకు బదులుగా సూచించారు. కానీ అతడికి స్టాండ్‌బైగా కూడా చోటు దక్కలేదు. బుమ్రా స్థానంలో షమి వచ్చాడు.

రిస్ట్‌ స్పిన్నర్లకు విముఖత: సూపర్‌-12లో ఐదు, సెమీ్‌సతో కలిపి ఆరు మ్యాచ్‌లు భారత్‌ ఆడింది. ఒక్కమ్యాచ్‌లోనూ జట్టులోని ఏకైక రిస్ట్‌ స్పిన్నర్‌ చాహల్‌ను బరిలో దించలేదు. టోర్నీ ఆసాంతం అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌తోనే భారత్‌ ఆడింది. టీ20 క్రికెట్‌ చరిత్రను పరిశీలిస్తే రిస్ట్‌ స్పిన్నర్లు వికెట్లు తీసిన ఘనత కనిపిస్తుంది. ఇలా పలు కారణాలతో విఫలమైన టీమిండియా మరోసారి ఫ్యాన్స్‌కు తీరని వేదన మిగిల్చింది.

టీ20 ప్రపంచకప్‌ మూడు సెమీఫైనల్స్‌లో హాఫ్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్‌ కోహ్లీ. పొట్టి ఫార్మాట్‌లో 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడు కూడా విరాటే.

Updated Date - 2022-11-11T07:43:38+05:30 IST