Ravi Shastri: టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ కావాల్సిందే!
ABN , First Publish Date - 2022-11-18T03:21:05+05:30 IST
పొట్టి ఫార్మాట్లో భారత్ రాత మారాలంటే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ను నియమించడమే మార్గమని మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి తేల్చి చెప్పాడు.
న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్లో భారత్ రాత మారాలంటే టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ను నియమించడమే మార్గమని మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి తేల్చి చెప్పాడు. ఇందుకు ఇంగ్లండ్ జట్టును ఉదాహరణగా తీసుకోవాలని సూచించాడు. 35 ఏళ్ల రోహిత్ శర్మ కొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో భారత్కు సారథిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్లో ఆ జట్టుతో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్సకు రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్కు విశ్రాంతి నిచ్చారు. దాంతో టీ20లకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో, వన్డేలకు శిఖర్ ధవన్ నాయకత్వంలో భారత్ తలపడుతోంది. ‘టీ20లకు కొత్త సారథిని నియమిస్తే ఎలాంటి నష్టం జరగబోదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకే ఆటగాడు మూడు ఫార్మాట్లలో ఆడడం సాధ్యంకాదు’ అని రవిశాస్త్రి స్పష్టంజేశాడు. ‘రోహిత్ ఇప్పటికే వన్డేలు, టెస్ట్ సారథిగా ఉన్నాడు. అందువల్ల టీ20లకు కొత్త కెప్టెన్ను నియమిస్తే తప్పులేదు. అతడు హార్దిక్ పాండ్యా అయితే మరీ మంచిది’ అని చెప్పుకొచ్చాడు.