అరగంటలో కోటి రూపాయలు కొట్టేశారు.. అచ్చం సినిమాల్లో జరిగినట్టుగానే..
ABN , First Publish Date - 2022-07-05T20:53:59+05:30 IST
మనం సినిమాల్లో బ్యాంకు దోపిడీ ఘటనలను చూస్తుంటాం.. దుండగులు బ్యాంకు ఉద్యోగులను బెదిరించి డబ్బు, బంగారం దోచుకుని పారిపోతారు.

మనం సినిమాల్లో బ్యాంకు దోపిడీ ఘటనలను చూస్తుంటాం.. దుండగులు బ్యాంకు ఉద్యోగులను బెదిరించి డబ్బు, బంగారం దోచుకుని పారిపోతారు.. అచ్చం సినిమాల్లో జరిగినట్టుగానే రాజస్థాన్లోని అళ్వార్లో ఉన్న రికో చౌక్ యాక్సిస్ బ్యాంక్లో చోరీ జరిగింది. మూడు బైక్లపై వచ్చిన దుండగులు దాదాపు కోటి రూపాయల విలువైన బంగారాన్ని ఎత్తుకెళ్లిపోయారు.. కేవలం 30 నిమిషాల్లో దుండగులు ఈ దోపిడీని పూర్తి చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు సాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
భర్త కనిపించడం లేదంటూ ఓ భార్య ఫిర్యాదు.. కంగారుగా కనిపించడంతో పోలీసులకు డౌట్.. ఆమె ఫోన్కాల్ డేటాను చెక్ చేస్తే..
సిబ్బంది ఎప్పటిలాగానే సోమవారం ఉదయం 10 గంటలకు బ్యాంకును తెరిచారు. కొద్ది క్షణాలకే ఆరుగురు దుండగులు మూడు బైక్లపై బ్యాంకు దగ్గరకు వచ్చారు. అందరూ మాస్క్లు ధరించారు. ఆరుగురి వద్దా ఆయుధాలు ఉన్నాయి. వాటిని చూపించి బ్యాంకు ఉద్యోగులను బెదిరించారు. వారి నుంచి లాకర్ తాళాలు తీసుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న సంచుల్లో డబ్బు, బంగారం వేసుకుని పరారయ్యారు. చోరీకి గురైన సొత్తు విలువ రూ. కోటి ఉంటుందని బ్యాంకు అధికారులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకున్నారు. జరిగిన ఘటనపై బ్యాంకు అధికారులను విచారించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసు బృందాలను రంగంలోకి దించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.