టీతో పాటు టిఫిన్ కూడా ఇవ్వలేదని కోడలిపై మామ ఆగ్రహం.. చివరకు ఎంత పని చేశాడంటే..
ABN , First Publish Date - 2022-04-15T21:22:51+05:30 IST
తన కోపమే తన శత్రువు అనేది పెద్దలు తరచుగా చెప్పే మాట.
తన కోపమే తన శత్రువు అనేది పెద్దలు తరచుగా చెప్పే మాట. చిన్న చిన్న విషయాలకు కూడా ఆగ్రహానికి గురైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. టీతో పాటు టిఫిన్ కూడా ఇవ్వలేదనే కారణంతో కోపం తెచ్చుకున్న ఓ వృద్ధుడు కోడలిపై దాష్టికానికి పాల్పడ్డాడు. చివరకు జైలు పాలయ్యాడు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన జరిగింది.
థానేకు చెందిన కాశీనాథ్ పాండురంగ్ పాటిల్ (76) అనే వ్యక్తికి అతని కోడలు గురువారం ఉదయం టీ ఇచ్చింది. `టీతో పాటు టిఫిన్ కూడా ఇవ్వాలని తెలీదా?` అంటూ కోడలిపై ఆ వ్యక్తి మాటలతో విరుచుకుపడ్డాడు. అక్కడితో శాంతించకుండా ఇంట్లో ఉన్న తుపాకీ తీసుకుని ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో బాధితురాలి పొట్టలోకి ఓ బుల్లెట్ దూసుకుపోయింది. దీంతో బాధితురాలు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.
కుటుంబ సభ్యులు ఆ ఘటన చూసి నివ్వెరపోయారు. బాధితురాలిని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స అందుకుంటోంది. కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాశీనాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోడలిపై మామ కాల్పుల వెనుక వేరే ఏమైనా కారణం ఉందా? అని అన్వేషణ సాగిస్తున్నారు.