మంచినీళ్లు ఇవ్వలేదని భార్యను కొట్టిన భర్త.. ఆ తర్వాత ఇద్దరూ ఎంత పని చేశారో తెలిస్తే షాక్!
ABN , First Publish Date - 2022-03-15T22:33:14+05:30 IST
వారిద్దరికీ ఏడాది క్రితం వివాహం జరిగింది.. అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో ఒక చిన్న గొడవ తీవ్ర పరిణామాలకు కారణమైంది..
వారిద్దరికీ ఏడాది క్రితం వివాహం జరిగింది.. అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో ఒక చిన్న గొడవ తీవ్ర పరిణామాలకు కారణమైంది.. మంచినీళ్లు ఇవ్వలేదని భర్త కొట్టడంతో అలిగిన భార్య అతడి ఎదురుగానే విషం తాగేసింది.. ఆ ఘటన చూసి షాకైన భర్త తను కూడా విషం తాగేశాడు.. భార్య ప్రాణాలు కోల్పోగా.. భర్త ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు.. బీహార్లోని భాగల్పూర్లో ఈ ఘటన జరిగింది.
భాగల్పూర్కు చెందిన జితేంద్ర అనే యువకుడు గతేడాది ప్రీతి కుమారి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొత్త దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. సోమవారం రాత్రి జితేంద్ర భోజనం చేస్తున్న సమయంలో ప్రీతి ఫోన్లో మాట్లాడుతోంది. భర్త మంచినీళ్లు ఇవ్వమన్నా పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ ఉండిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన జితేంద్ర భార్యను కొట్టాడు. తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి.. భర్త ఎదురుగానే పురుగుల మందు తాగేసింది.
భార్య చేసిన పనికి షాకైన జితేంద్ర.. `నువ్వు లేకుండా నేను బతకలేన`ని అంటూ అతను కూడా విషం తాగేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందుకుంటూ ప్రీతి మరణించింది. జితేంద్ర ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.