టికెట్ కౌంటర్ ఒక రాష్ట్రంలో.. బాత్రూం మరో రాష్ట్రంలో.. భారత్లోనే అరుదైన రైల్వేస్టేషన్ కథ ఇదీ..!
ABN , First Publish Date - 2022-01-16T02:50:42+05:30 IST
ఈ రైల్వే స్టేషన్లోని కౌంటర్ ఒక రాష్ట్రంలో ఉండగా.. బాత్రూం మరో రాష్ట్రంలో ఉంది. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇది నిజం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రైల్వే స్టేషన్ను బహుశా.. మీరు ఎక్కడా చూసుండరు. దేశంలోనే రెండో..

ఈ రైల్వే స్టేషన్లోని కౌంటర్ ఒక రాష్ట్రంలో ఉండగా.. బాత్రూం మరో రాష్ట్రంలో ఉంది. ఏంటీ ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం! ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి రైల్వే స్టేషన్ను బహుశా.. మీరు ఎక్కడా చూసుండరు. దేశంలోనే రెండో అరుదైన స్టేషన్గా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. దేశంలో పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఈ అరుదైన స్టేషన్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..
దేశంలోనే అనేక ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ రైల్వే స్టేషన్ పేరు నవాపూర్ రైల్వే స్టేషన్. ఈ ప్రాంతం మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో ఉంది. అయితే ఈ రైల్వే స్టేషన్లోని కొంత భాగం మహారాష్ట్రతో పాటూ గుజరాత్లో ఉండడమే అసలు విశేషం. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల సరిహద్దును ఈ స్టేషన్ విభజించడం వల్ల వార్తల్లోకి ఎక్కింది. స్టేషన్ ప్లాట్ఫామ్ మధ్యలో ఓ బెంచ్ను ఏర్పాటు చేశారు. ఈ బెంచ్ సగానికి అటు, సగానికి ఇటు రెండు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి. దీంతో ప్లాట్ఫామ్లోని వస్తువులు, గదులు తదితరాలను రెండు రాష్ట్రాలూ పంచుకున్నాయి.

ఈ స్టేషన్లో మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. స్టేషన్ పొడవు 800మీటర్లు కాగా, అందులో 500 మీటర్లు గుజరాత్, మిగిలిన 300 మీటర్లు మహారాష్ట్ర పరిధిలోకి వస్తుంది. రైలు వేళలకు సంబంధించిన ప్రకటన కూడా నాలుగు భాషల్లో వస్తుంది. ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో ప్రకటిస్తుంటారు. అలాగే ఇందులోని టికెట్ కౌంటర్, రైల్వే పోలీస్ స్టేషన్ మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా పరిధిలో ఉండగా, స్టేషన్ మాస్టర్ కార్యాలయం, వెయిటింగ్ రూమ్, బాత్రూం గుజరాత్లోని తాపి జిల్లా పరిధిలో ఉన్నాయి. మరోవైపు నిబంధనలు కూడా వేరుగా ఉంటాయి. గుజరాత్ వైపు ప్రాంతంలో మద్య నిషేధం అమల్లో ఉండగా.. మహారాష్ట్ర వైపు ప్రాంతంలో పాన్ మసాలాను నిషేధించారు.
2018లో అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్.. ఈ స్టేషన్ను సందర్శించారు. ఆ సమయంలో ఆయన రెండు రాష్ట్రాల సరిహద్దు మధ్యలో ఉన్న బెంచ్ను ఫొటో తీసి.. ‘‘రాష్ట్రాల కారణంగా విడిపోయారు, కానీ రైల్వేల కారణంగా ఐక్యమయ్యారు’’.. అంటూ క్యాప్షన్ ఇచ్చి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దేశంలో నవాపూర్ స్టేషన్తో పాటూ మరో స్టేషన్కు ప్రత్యేకత ఉంది. భవానీ మండి రైల్వే స్టేషన్లోని ఒక భాగం మధ్యప్రదేశ్లోని మందసౌర్లో ఉండగా, మరో భాగం రాజస్థాన్లోని ఝలావర్లో ఉంది.
