CP Brown: తెలుగు సాహిత్యానికి వెలుగుబాట సి. పి. బ్రౌన్.

ABN , First Publish Date - 2022-12-12T15:32:00+05:30 IST

తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్

CP Brown: తెలుగు సాహిత్యానికి వెలుగుబాట సి. పి. బ్రౌన్.
సి పి బ్రౌన్

1825 ప్రాంతాల్లో తెలుగుకు వెలుగులు అద్ది అంధకారాన్ని తరిమినవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు సాహిత్యరంగంలో విశేష సేవ చేసిన వాడు మన భారత భూమిలో పుట్టకపోయినా స్వదేశీయుడే అయిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు శబ్దకోశాన్ని ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటి వరకూ తెలుగులో ప్రామానికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిష్ అధికారులలో బ్రౌన్ అగ్రగణ్యుడు. ఆంధ్ర భాషోద్దారకుడు.

దేశం నలుమూలలా ఎక్కడెక్కడో పడివున్న సాహిత్య గ్రంథాలన్నింటినీ సేకరించి వాటితో పాటు పూర్వం నుంచి మన సాంప్రదాయంగా ఉన్న తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్న కావ్యాలను, కాగితాల మీదకు మార్చి పండితుల చేత సవరింపజేసిన వాడు బ్రౌన్ తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్.

కలకత్తాలో 1798 నవంబర్ లో 10న పుట్టాడు. ఆయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్త్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌన్ కుటుంబం ఇంగ్లాండుకు వెళ్ళింది. అక్కడే హిందుస్థానీ భాషను నేర్చుకున్నాడు. 1817 ఆగష్ట్ 4మ మద్రాస్ లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగు భాషలో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించాడు. 1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకు పూనుకొనేలా చేసింది.

ఈ సేవలో భాగంగానే ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికి తీసి ప్రజలందరికీ అర్థమయ్యేలా పరిష్కరించి, ప్రచురించాడు. ఆ కృషిలో భాగంగా ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు పుట్టాయి. మచిలీపట్నం గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైన చోట్ల పనిచేసిన బ్రౌన్ 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.

అక్కడే తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు. మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చిన గుంటూరు కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా పనిచేసాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న లండన్ లో అవివాహితునిగానే మరణించాడు.

తెలుగు భాషకు చేసిన సేవ...

1. వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు.

2. 1841లో నలచరిత్ర ను ప్రచురించాడు.

3. ఎందరికో ఆరాధ్యమైన, పవిత్రమైన ఆంధ్రమహాభారతము, శ్రీమద్భాగవతములను ప్రచురించాడు.

4. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు.

5. లండన్‌లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.

6. బ్రౌన్ వ్యాయ ప్రయాసలకోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంథాలు అసంఖ్యాకం. మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, 7. పండితారాధ్య చరిత్ర, దశావతార చరిత్ర మొదలైన కావ్యాలు, ప్రబంధాలు బ్రౌన్ కృషి వల్లనే తెలుగు వారికి అందుబాటులోకి వచ్చాయి.

8. హరిశ్చంద్రుని కష్టాలు గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.

1844లో వసుచరిత్, 1851లో మనుచరిత్ర ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.

1852లో పలనాటి వీరచరిత్ర ప్రచురించాడు.

చిత్తు కాగితాలుగా ఉపయోగిస్తున్నవేమన ప్రతులను చూసి బాధపడి, ఆ గ్రంథాన్ని పునర్ముద్రించాడు.

కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు.

ఈ నాటికీ ప్రామాణికంగా ఉన్న బ్రౌన్ ఇంగ్లిష్ ,తెలుగు, తెలుగు, ఇంగ్లిష్ dictionary ని ఆయన 1852, 1853లో తయారు చేసాడు.

బ్రౌను స్మృతి చిహ్నంగా, కడపలో ఆయన నివసించిన బంగళా స్థలంలో ప్రభుత్వము, ప్రజలు సంయుక్తంగా గ్రంథాలయాన్ని నిర్మించారు. వివిధ సంస్థలు, వ్యక్తులు గ్రంథాలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం ఇది భాషా, సాహిత్య పరిశోధనా కేంద్రంగా ద్రవిడ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా పని చేస్తోంది

Updated Date - 2022-12-13T10:15:31+05:30 IST