సెల్ఫీ పిచ్చి ఎంత పని చేసిందంటే.. కెమేరా క్లిక్ చేయబోయి గన్ ట్రిగ్గర్ నొక్కాడు.. చివరకు..
ABN , First Publish Date - 2022-03-14T16:51:17+05:30 IST
ప్రస్తుతం సెల్ఫీ యుగం నడుస్తోంది. ఏది చూసినా దానితో సెల్ఫీ తీసుకుని దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసెయ్యడం ట్రెండ్గా మారింది.
ప్రస్తుతం సెల్ఫీ యుగం నడుస్తోంది. ఏది చూసినా దానితో సెల్ఫీ తీసుకుని దానిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసెయ్యడం ట్రెండ్గా మారింది. ఈ సెల్ఫీ పిచ్చి ముదిరి ఒక్కోసారి తీవ్ర పరిణామాలకు దారి తీస్తోంది. రాజస్థాన్కు చెందిన ఓ యువకుడు తాజాగా తుపాకీతో సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాలు కోల్పోయాడు.
భరత్పూర్కు సమీపంలోని ధోలాపూర్ గ్రామానికి చెందిన సచిన్ అనే యువకుడు దేశవాలీ తుపాకీతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. ఆదివారం ఉదయం తన ఇంటికి సమీపంలోని పొలంలోకి వెళ్లి అక్కడ తుపాకీని తలకు గురిపెట్టి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే కంగారులో సెల్ఫీ కెమేరా క్లిక్మనిపించబోయి, తుపాకీ ట్రిగ్గర్ నొక్కేశాడు. దాంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. సాయంత్రానికి అంత్యక్రియలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు అంత్యక్రియలను అడ్డుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టమ్కు తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.