హిజ్రాకు లింగమార్పిడి చేసేందుకు బీఫార్మసీ విద్యార్థుల ఒప్పందం.. గది అద్దెకు తీసుకుని మరీ ఆపరేషన్.. చివరకు..
ABN , First Publish Date - 2022-02-26T03:03:04+05:30 IST
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హిజ్రా.. కూడా లింగమార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం బీఫార్మసీ విద్యార్థులతో ఒప్పందం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. చివరికి పుట్టుకతో వచ్చిన అవయవాలను కూడా మార్చుకునే వెసులుబాటు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల లింగమార్పిడి అనే మాటను తరచూ వింటూనే ఉన్నాం. కొందరు హిజ్రాలు లక్షలకు లక్షలు ఖర్చు చేసి మరీ లింగమార్పిడి చేయించుకుంటూ ఉంటారు. ఇంకొందరు అంత ఖర్చు చేయలేక నిరుత్సాహంతోనే జీవనం సాగిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఓ హిజ్రా.. కూడా లింగమార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం బీఫార్మసీ విద్యార్థులతో ఒప్పందం చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన బీ శ్రీకాంత్ అలియాస్ అమూల్య (28)కు వివాహమైంది. అయితే ఇతను హిజ్రా కావడంతో పెళ్లయిన ఆరునెలలకే భార్య దూరమైంది. దీంతో నాలుగేళ్ల కిందట శ్రీకాంత్ ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఒంగోలులో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతనికి విశాఖపట్టణానికి చెందిన మోనాలిసా అలియాస్ అశోక్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ వివిధ ప్రాంతాలకు తిరుగుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్కు నెల్లూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఫార్మసీ చదువుతున్న ఏ మస్తాన్, జీవాలతో ఆరు నెలల కిందట ఓ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో తాను ముంబయి వెళ్లి లింగమార్పిడి చేసుకోవాలనుకుంటున్నట్లు మస్తాన్కు శ్రీకాంత్ చెప్పాడు.
ప్రాణాల మీద ఆశలు వదులుకున్న సమయంలో.. మృత్యుంజయుడు అవుతానని అతను ఊహించి ఉండడు..
ముంబయిలో శస్త్రచికిత్స చేయించుకుంటే రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని, తాము రూ.15వేలకే చేస్తామని మస్తాన్ తెలిపాడు. దీంతో అందరూ కలిసి ఈ నెల 23వ తేదీన నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లోని ఎస్ఎస్ లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. 24వ తేదీ మస్తాన్, జీవాలు మోనాలిసా సహాయంతో శ్రీకాంత్ అలియాస్ అమూల్యకు శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు. మర్మాంగాన్ని పూర్తిగా తొలగించడంతో తీవ్రరక్తస్రావమైంది. అలాగే పల్స్ కూడా పడిపోవడంతో పాటు మోతాదుకు మించి మందులు వాడటంతో కొద్దిసేపటికే అమూల్య మృతి చెందింది. దీంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం గమనించిన లాడ్జి సిబ్బంది.. చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.