Anand Mahindra: అది ఎప్పటికీ జరగదు.. అభిమాని ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా సమాధానం
ABN , First Publish Date - 2022-12-11T18:14:18+05:30 IST
ట్విటర్లో నెటిజన్ల ప్రశ్నలపై తరచూ స్పందించే ఆనంద్ మహీంద్రాకు తాజాగా మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో తన అభిప్రాయాలు పంచుకునే భారత వ్యాపారవేత్తల్లో మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) ముందుంటారు. సమకాలీన అంశాలతో పాటూ తనను ఆశ్చర్యపరిచిన పలు అంశాల గురించి ఆనంద్ మహీంద్రా తరచూ ట్విటర్లో స్పందిస్తుంటారు. కాస్తంత చమత్కారంతో కూడిన ఆయన ట్వీట్లు నిత్యం వైరల్(Viral) అవుతుంటాయి. ఇక ఆయన సారథ్యంలోని మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సంస్థలు అద్భుత విజయాలు నమోదు చేస్తున్నాయి.
ట్విటర్లో నెటిజన్ల ప్రశ్నలపై తరచూ స్పందించే ఆనంద్ మహీంద్రాకు తాజాగా మరో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు భారత్లో అత్యంత ధనవంతుడిగా(Indias Richest person) ఎప్పుడు రికార్డు సృష్టిస్తారంటూ ఓ అభిమాని ఆయనను ప్రశ్నించారు. దాదాపు నెల రోజుల క్రితం ఓ అభిమాని ఆయనను ఈ ప్రశ్న అడిగారు. దీనికి మహీంద్రా తాజాగా రిప్లై ఇచ్చారు. ‘‘నిజం చెప్పాలంటే అది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే.. నాకు అసలు అలాంటి కోరికే లేదు.’’ అని ఆయన స్పష్టం చేశారు. ఫోర్బ్స్(Forbes) పత్రిక ప్రకారం.. భారత్లోని అపరకుబేరుల జాబితాలో ఆనంద్ మహీంద్రాది 91వ ర్యాంక్. ఆయన సంపద విలువ 2.1 బిలియన్ డాలర్లు. ఇక ఇండియాలోని తొలి 100 మంది అపరకుబేరుల మొత్తం సంపద విలువ 800 బిలియన్ డాలర్లు.
భారత ధనవంతుల్లో తనకు నెం .1 కావాలన్న కోరికే లేదని ఆనంద్ మహీంద్రా చెప్పడం నెటిజన్లను ఆకట్టుకుంది. దీంతో..ఆయనపై ప్రశంసల వర్షం కురిసింది. గొప్ప వ్యక్తులు ఎప్పుడూ దేశం గురించే ఆలోచిస్తారంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఏ కోరికా లేని వాడే అసలైన ధనవంతుడు అని మరొ నెటిజన్ వ్యాఖ్యానించాడు. ‘‘ధనవంతులైన వారెవరూ డబ్బు కోసం పాకులాడలేదు. శక్తి మేరకు తమ వ్యాపారాల్ని అభివృద్ధి పరిచారు. ఈ క్రమంలో రికార్డులు సృష్టించారు. మనందరం కూడా ఈ మార్గాన్ని అనుసరించాలి’’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.